హైదరాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో ఓ సారు బాగోతం
ABN , First Publish Date - 2021-09-30T17:50:07+05:30 IST
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో ఓ సారు బాగోతం ఉన్నతాధికారులను షాక్కు గురిచేస్తోంది.
హైదరాబాద్: ప్రభుత్వం గిరిజన ప్రాంత పేదల కోసం అంబులెన్స్ ఏర్పాటు చేసింది. కానీ అక్కడినుంచి బదిలీ అయిన అధికారి ఆ వాహనంతో సహా హైదరాబాద్ వచ్చారు. అంబులెన్స్ను కారులా మార్చారు. సొంత వాహనంలా షికారు చేస్తున్నారు. ఆ కథ ఏంటో చూడండి...
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో ఓ సారు బాగోతం ఉన్నతాధికారులను షాక్కు గురిచేస్తోంది. ఐదేళ్లుగా ప్రభుత్వ వాహనాన్ని సొంత వాహనంగా వాడుకుంటున్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖలోని రవాణా విభాగంలో ఉన్నతాధికారిగా ఉన్న ఆయన బాధ్యతాయుతమైన హోదాలో ప్రజలకు సేవ చేయాల్సిందిపోయి తన సొంత లాభం చూసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా గిరిజన ప్రాంతాల్లో పని చేసిన ఆయన ఐదేళ్ల క్రితం హైదరాబాద్కు బదిలీ అయ్యారు. గిరిజనుల కోసం ప్రభుత్వం కేటాయించిన అంబులెన్స్ను వెంట తెచ్చుకున్నారు. దాన్ని కారుగా మార్చుకుని వాడుకుంటున్నారు. కాగా ఆ అంబులెన్స్ కారుపై 10 చలానాలు పెండింగ్లో ఉన్నాయి. ఏపీ 20 టీసీ 2701 నెంబర్ వాహనాన్ని పరిశీలిస్తే టాక్స్ ఫ్రీ వాహనమని తేలింది. దీనికి 2013లో డీఎంహెచ్వో ఖమ్మం పేరిట రిజిస్టర్ అయింది. తర్వాత ఎలాంటి రెన్యువల్ జరగలేదు. ఫిట్నెస్ గడువు 2015లోనే తీరిపోయింది. ఇన్సురెన్స్ పత్రాలు కూడా రెన్యూవల్ కాలేదు. టాక్స్ చెల్లింపులు జరగలేదు. ఆయన తీరుపై వైద్యఆరోగ్యశాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విచారించి చర్యలు తీసుకుంటామని అంటున్నారు.