గోషామహల్లో వివాదానికి దారి తీసిన స్వచ్ఛంద లాక్డౌన్
ABN , First Publish Date - 2021-04-15T18:06:27+05:30 IST
కరోనా నేపథ్యంలో స్వచ్ఛంద లాక్డౌన్పై గోషామహల్ దాల్ మండీలో
హైదరాబాద్/అఫ్జల్గంజ్ : కరోనా నేపథ్యంలో స్వచ్ఛంద లాక్డౌన్పై గోషామహల్ దాల్ మండీలో వివాదం ఏర్పడింది. సొసైటీ అధ్యక్షురాలు, టీఆర్ఎస్ నాయకురాలు శాంతిదేవి తన అనుచరులతో ఓ ఫ్లైవుడ్ షాప్ యజమానిని దుకాణం మూసేయాలని చెప్పడంతో అతను ఎదురుతిరిగాడు. ఇది గొడవకు దారితీసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దాల్మండీ ప్రాంతానికి చెందిన విక్రమ్ జైన్, ముఖేష్ జైన్, కమలే్షజైన్ అన్నదమ్ములు. కొన్నేళ్లుగా అరియంత్ లామినేషన్ ఫ్లైవుడ్ దుకాణాన్ని కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి 9 గంటల ప్రాంతంలో శాంతిదేవి, అతని సోదరుడు మరి కొంత మందితో కలిసి విక్రమ్ జైన్ దుకాణం వద్దకు వచ్చారు. ‘‘కరోనా విజృంభణ నేపథ్యంలో ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకే దుకాణాలు నిర్వహించాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది’’ అని తెలిపారు.
దీంతో విక్రమ్జైన్, ముఖేష్ జైన్ ‘నువ్వు అధికారివా.. ఎందుకు మూసివేయాలి’ అని అనడంతో ఇద్దరి మధ్యా మాటల యుద్ధం జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. ఆగ్రహావేశాలకు గురై ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు. విక్రమ్ జైన్కు, శాంతిదేవికి ఇద్దరికీ గాయాలయ్యాయి. సీసీ ఫుటేజీలో రికార్డయిన దాడి దృశ్యాలు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతోఇరువురూ బేగంబజార్ పీఎ్సలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.