కాకినాడ సెజ్ రైతులకు శుభవార్త

ABN , First Publish Date - 2021-02-24T02:34:54+05:30 IST

కాకినాడ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది.

కాకినాడ సెజ్ రైతులకు శుభవార్త

అమరావతి: కాకినాడ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. కాకినాడ సెజ్‌లో భూములిచ్చి పరిహారం వద్దని తిరస్కరించిన రైతులకు చెందిన 2,180 ఎకరాలు వెనక్కు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ రోజు జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాకినాడ సెజ్ దేశంలోనే పెద్దదని మంత్రి కన్నబాబు అన్నారు. ఈ సెజ్ ఏర్పాటు కోసం ఆరు గ్రామాలను ఖాళీ చేయించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో గ్రామాలను ఖాళీ చేయించేందుకు రైతులపై వందలాది కేసులు పెట్టారని, ఆ కేసులను కూడా ఎత్తివేసేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు.


గత ప్రభుత్వాలు రైతులపై ఉక్కు పాదం మోపి భూములు తీసుకున్నాయని ఆయన ఆరోపించారు. రైతుల అభిప్రాయం తీసుకుని సీఎంకు నివేదిక ఇచ్చామని మంత్రి తెలిపారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించే రాష్ట్ర చట్టాన్ని కూడా సెజ్‌లో అమలు చేసేందుకు అంగీకారం కుదిరిందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. 




కాకినాడ సెజ్ కోసం మొత్తం 10 వేల ఎకరాలను సేకరించాలని నిర్ణచించారు. సెజ్‌ పరిధిలో చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా 2005 నుంచి కొంతమంది రైతులు ఇప్పటిదాకా పోరాడుతున్నారు. ప్రభుత్వం, ఆ తర్వాత సెజ్ యాజమాన్యం ప్రకటించిన పరిహారం తీసుకోవడానికి నిరాకరించారు. అనేక మంది రైతులు పరిహారం తీసుకున్నారు. అయితే 2,180 ఎకరాలకు చెందిన రైతులు మాత్రం పరిహారం తీసుకోవడానికి నిరాకరించారు. పలు ఉద్యమాలు నిర్వహించారు. సెజ్ రైతులను ఆదుకుంటానని ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ చెప్పారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతులకు సీఎం జగన్ న్యాయం చేశారు. 

Updated Date - 2021-02-24T02:34:54+05:30 IST