మంచి అవకాశం...ఆపై మీ ఇష్టం
ABN , First Publish Date - 2021-12-09T08:33:49+05:30 IST
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై(ఓటీఎస్) ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
- అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు
- అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది
- ఓటీఎస్తో పూర్తి హక్కులు లభిస్తాయి
- హౌసింగ్పై సమీక్షలో సీఎం వ్యాఖ్యలు
అమరావతి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై(ఓటీఎస్) ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ‘‘ఓటీఎస్ పథకం ద్వారా అన్ని రకాలుగా హక్కులిస్తున్నాం. అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు. అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది. పేదలకు మంచి అవకాశం ఇది. దీనిని వాడుకోవాలా లేదా అన్నది వారి ఇష్టం’’ అని గృహనిర్మాణంపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ‘‘ఓటీఎస్ పూర్తిగా స్వచ్ఛందం. ఈ పథకంతో ఏ రకంగా మంచి చేకూరుతుందనేది ప్రజలకు విడమరిచి చెప్పింది. ఓటీఎ్సలో చేరితే క్లియర్ టైటిల్తో రిజిస్ర్టేషన్ జరుగుతుంది. సుమారు రూ.10 వేల కోట్ల రూపాయల రుణ భారం తొలగిపోతుంది. వారి రుణాలన్నీ మాఫీ చేస్తున్నాం, రిజిస్ర్టేషన్ కూడా ఉచితంగా చేస్తున్నాం. వారికి సంపూర్ణ హక్కులు వస్తాయి. ఈ విషయాలన్నీ వివరించండి’’ అని అధికారులకు సీఎం సూచించారు. ఈ పథకం అమలు కాకుండా చాలా మంది చాలా రకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘‘వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదనను గత ప్రభుత్వం పట్టించుకోలేదు.
సుమారు 43 వేల మంది గత ప్రభుత్వ హయాంలోనే అసలు, వడ్డీ కూడా కట్టారు. ఇవాళ మాట్లాడుతున్న వారు... అప్పుడు ఎందుకు కట్టించుకున్నారు? గతంలో అసలూ, వడ్డీ కడితే బీ-ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని రకాలుగా హక్కులు ఇస్తున్నాం’ అని వివరించారు. ఈనెల 21 నుంచే రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం ప్రారంభమవుతుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటి రుణాలు చెల్లించినవారికి కూడా రిజిస్ట్రేషన్ చేయిస్తామనీ, వారికీ సంపూర్ణ హక్కులు కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో కూడా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ పనులు జరుగుతాయని చెప్పారు. 22-ఏ (నిషేధ జాబితా) తొలగింపునకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని, ఓటీఎస్ వినియోగించుకున్న వారికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, యూజర్ ఫీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని సీఎంకు అధికారులు వివరించారు. ఓటీఎస్ వినియోగించుకున్న వారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఫీల్డ్స్కెచ్, లోన్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. గృహనిర్మాణం పై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని, కోర్టు కేసులు పరిష్కారం అయ్యాయని ఈ సమయంలో ముఖ్యమంత్రి అన్నారు. ‘‘ఇళ్ల నిర్మాణాలు వేగం పుంచుకోవాలిక. సొంతంగా ఇళ్లు కట్టుకునే వారికి నిర్మాణంలో మంచి సలహాలు అందించండి’’ అని సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సీఎస్ సమీర్శర్మ తదితరులు పాల్గొన్నారు.