గోదావరికి పెరుగుతున్న వరద

ABN , First Publish Date - 2022-08-09T05:22:00+05:30 IST

గోదావరికి పెరుగుతున్న వరద

గోదావరికి పెరుగుతున్న వరద
మేడిగడ్డ బ్యారేజీ నుంచి దిగువకు విడుదలవుతున్న నీరు

మహదేవపూర్‌ రూరల్‌, ఆగస్టు 8 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతోంది. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వరద ప్రవా హం పెరిగింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సోమవారం గోదావరి 10.12 మీటర్ల ఎత్తులో ప్రవహించింది. ఈ క్రమంలో బ్యారేజీలకు వరదనీరు వచ్చి చేరుతోంది. కాళేశ్వరానికి ఎగువన ఉన్న అన్నారం(సరస్వతి) బ్యారేజీ లోకి 2,15,451 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుండగా 66 గేట్లను ఎత్తి అంతే నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 109.57 మీటర్లు నమోదైంది. అలాగే కాళేశ్వరానికి దిగువన ఉన్న మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీకి 4,96,370 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. దీంతో బ్యారేజీ 85గేట్లను ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 94.10 మీటరు ఉండగా ఆదివారంతో పోలిస్తే బ్యారేజీలోకి వచ్చే ఇన్‌ఫ్లో 1,16,460 క్యూసెక్కులు పెరిగింది.

దేవాదుల, తుపాకులగూడెం వద్ద..  

కన్నాయిగూడెం ! ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గుట్టల గంగారం వద్ద ఉన్న జె.చొక్కారావు దేవాదుల ఎత్తి పోతల ప్రాజెక్టు వద్ద, తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్‌ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం పెరుతుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న బారీ వర్షాలతోపాటు ఎగువన ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతుండటం, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల నుంచి ఇంద్రావతి నది వరద  కలవడంతో గోదావరికి వరద పెరిగింది. దేవాదుల ఇన్‌టేక్‌వెల్‌ వద్ద సోమవారం గోదావరి 82.00 మీటర్ల ఎత్తులో ప్రవహించింది. తుపాకులగూడెం సమ్మక్క సాగర్‌ బ్యారేజీ వద్ద 80.2 మీటర్లు నమోదైంది.  6 లక్షల 2 వేల 350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో బ్యారేజీలోని మొత్తం 59 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా 4.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

Updated Date - 2022-08-09T05:22:00+05:30 IST