కరోనాకు కొత్త చికిత్స.. మూడో దశ ట్రయల్స్ ప్రారంభించిన గ్లెన్‌మార్క్

ABN , First Publish Date - 2020-05-27T02:45:43+05:30 IST

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. భారత్‌లో కూడా ఈ వైరస్ విజృంభిస్తోంది.

కరోనాకు కొత్త చికిత్స.. మూడో దశ ట్రయల్స్ ప్రారంభించిన గ్లెన్‌మార్క్

హైదరాబాద్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. భారత్‌లో కూడా ఈ వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఫావిపిరావిర్, యుమిఫెనోవిర్ అనే రెండు యాంటీవైరల్ ఔషధాలను కలిపి కరోనా కోసం కొత్త చికిత్సా విధానాన్ని రూపొందించడానికి ఫార్మా సంస్థ గ్లెన్‌మార్క్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా తేలికపాటి కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరిన 158మందికి ఈ విధానంలో చికిత్స అందించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం భారతీయ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి గ్లెన్‌మార్క్ అనుమతులు అందుకుంది. కరోనా రోగుల చికిత్స తొలిదశలోనే వారికి ఈ విధానంలో చికిత్స చేయాల్సి ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. శరీరంలో వైరస్ లక్షణాలు ప్రారంభమైనప్పుడే ఈ ఔషధం అత్యధికంగా ప్రభావం చూపుతుందట. ఈ ప్రయోగం మంచి ఫలితాలనిస్తే కరోనాను చాలావరకు నియంత్రించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని గురించి గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్, క్లినికల్ డెవలప్‌మెంట్ విభాగం అధినేత్రి డాక్టర్ మోనికా టాండన్ మాట్లాడారు. ‘వివిధ వైరస్‌లను సమర్ధవంతంగా నియంత్రించే యాంటీవైరల్ ఏజెంట్లను మిళితం చేసి రూపొందించే చికిత్సా విధానాలు ప్రభావవంతంగా ఉంటాయి. వైరస్ తొలిదశలో ఉండగా ఈ విధానం చాలా మెరుగ్గా పనిచేస్తుంది’ అని చెప్పారు.

Updated Date - 2020-05-27T02:45:43+05:30 IST