జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-12-06T08:57:59+05:30 IST
హైదరాబాద్ వెళ్లి షాపింగ్ చేసుకుని వస్తున్నారు. మరో అరగంటలో ఇంటికి చేరుకుంటారు. కానీ ఇంతలోనే వారిని ప్రమాదం అడ్డుకుంది.
- ఆర్టీసీ బస్సు, కారు ఢీ, ముగ్గురి మృతి
- మృతుల్లో ఇద్దరు చిన్నారులు
కోరుట్ల రూరల్/మేడిపల్లి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ వెళ్లి షాపింగ్ చేసుకుని వస్తున్నారు. మరో అరగంటలో ఇంటికి చేరుకుంటారు. కానీ ఇంతలోనే వారిని ప్రమాదం అడ్డుకుంది. ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన ఇది. కోరుట్ల పట్టణంలోని బిలాల్పురకు చెందిన జావిద్ బిన్ సులేమాన్ దంపతులు తమ కుమారులు మహ్మద్ అనాస్, ఎండీ అషార్, ఎండీ ఆజాన్లతో కలిసి అద్దె కారులో శనివారం ఉదయం హైదరాబాద్ వెళ్లి షాపింగ్ చేసి తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా మేడిపల్లి వద్దకు వచ్చేసరికి, వారు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజునుజ్జయింది. బస్సు ముందు టైరు ఊడిపోయింది. కారు డ్రైవర్ సాజిద్(35), ఎండీ ఆజాన్(5) అక్కడికక్కడే మృతి చెందారు. అషార్, అనాస్, సులేమాన్ దంపతులు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. కారులోనే ఇరుక్కుపోయిన వారిని స్థానికులు బయటకు తీశారు. సమాచారం అందుకున్న కోరుట్ల, మేడిపల్లి పోలీసులు, 108 సిబ్బందితో సహా ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జగిత్యాల అసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఎండీ అషార్(9) మృతి చెందాడు. బస్సులో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం దంపతుల పరిస్థితి నిలకడగానే ఉండగా అనాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రమాద తీవ్రతను చూసి సొమ్మసిల్లి పడిపోవడం గమనార్హం.