జెన్వర్క్కు రూ.1,200 కోట్ల నిధులు
ABN , First Publish Date - 2021-11-24T09:05:48+05:30 IST
: కంపెనీలకు సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్) ప్రాతిపదికన సొల్యూషన్లను అందిస్తున్న....
హైదరాబాద్ కేంద్రంలో నిపుణులు పెంపు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కంపెనీలకు సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్) ప్రాతిపదికన సొల్యూషన్లను అందిస్తున్న హైదరాబాద్కు చెందిన ఫిన్టెక్ కంపెనీ జెన్వర్క్ రూ.1,200 కోట్ల నిధులను సమీకరించింది. స్పెక్ట్రమ్ ఈక్విటీ ఈ నిధులను అందించింది. కొత్త సొల్యుషన్ల అభివృద్ధి, ఆటోమేటెడ్ సొల్యూషన్లకు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా విస్తరించడానికి తాజా లభించిన నిధులను వినియోగించనున్నట్లు జెన్వర్క్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సంజీవ్ సింగ్ తెలిపారు. గత రెండేళ్లలో ఏడాదికి 40 వేల మంది కంపెనీ ఖాతాదారుల జాబితాలో చేరారని అన్నారు. కంపెనీ హైదరాబాద్, అమెరికాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా ఉన్న ఖాతాదారులకు మద్దతు అందించడానికి హైదరాబాద్ కేంద్రాన్ని విస్తరించనున్నాం. హైదరాబాద్లో 60 మంది, అమెరికాలో 20 మంది నిపుణులు పనిచేస్తున్నారు. 2022 చివరి నాటికి నిపుణుల సంఖ్యను 180-200 మందికి పెంచుకోనున్నామని సిం గ్ చెప్పారు. ‘ట్యాక్స్ 1099’ బ్రాండ్తో క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫామ్ను కంపెనీ అందిస్తోంది. ఇది ఈ-ఫైలింగ్, ఈ-డెలివరీలను ఆటోమేట్ చేస్తుంది. ‘కాంప్లియన్సీలీ’ పేరుతో ఐడెంటిటీ చెక్ ప్లాట్ఫామ్ను కూడా అందిస్తోంది.