కూకట్‌పల్లిలో యువతిపై గ్యాంగ్‌రేప్‌

ABN , First Publish Date - 2020-10-17T07:06:22+05:30 IST

పుట్టిన రోజు వేడుకల పేరుతో ఓ యువతిని హోటల్‌కు పిలిపించిన ముగ్గురు దుండగులు.. కేకులో మత్తుమందు కలిపి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఉదంతమిది. ఈ ఘటన కూకట్‌పల్లి భాగ్యనగర్‌ కాలనీలోని ఆనంద్‌

కూకట్‌పల్లిలో యువతిపై గ్యాంగ్‌రేప్‌

కూకట్‌పల్లి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): పుట్టిన రోజు వేడుకల పేరుతో ఓ యువతిని హోటల్‌కు పిలిపించిన ముగ్గురు దుండగులు.. కేకులో మత్తుమందు కలిపి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఉదంతమిది. ఈ ఘటన కూకట్‌పల్లి భాగ్యనగర్‌ కాలనీలోని ఆనంద్‌-ఇన్‌ హోటల్‌లో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. సనత్‌నగర్‌లోని వినాయకనగర్‌కు చెందిన ఎం.జోసెఫ్‌, బి.నవీన్‌రెడ్డి, ఆర్‌.రాము స్నేహితులు. వీరికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి(19)తో ఏడాదిగా పరిచయం ఉంది. డిగ్రీ చదువుతున్న ఆ యువతిని.. ఈ నెల 5న జోసెఫ్‌ పుట్టిన రోజు పార్టీకి రావాలంటూ ఆ ముగ్గురూ ఆహ్వానించారు. నలుగురు కలిసి సికింద్రాబాద్‌, ట్యాంక్‌బండ్‌ ప్రాంతాల్లో తిరిగి.. కేక్‌ కటింగ్‌ కోసం భాగ్యనగర్‌ కాలనీలోని ఆనంద్‌-ఇన్‌ హోటల్‌లో 218వ నెంబరు గదిని బుక్‌ చేసుకున్నారు. పక్కా ప్రణాళికతా వారంతా కేకులో మత్తుమందు కలిపారు. కేక్‌ కట్‌చేశాక.. ‘‘లేడీస్‌ ఫస్ట్‌’’ అంటూ ఆ యువతితో కేకు తినిపించారు. ఆమె అపస్మారక స్థితికి వెళ్లగానే.. ఆ ముగ్గురూ ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు. కొద్ది గంటల తర్వాత ఆ యువతి స్పృహలోకి రావడంతో.. ఆటోలో ఇంటికి పంపించారు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. దాంతో భయపడిన ఆ యువతి.. జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పలేదు. ఈ నెల 11న ఆమె అనారోగ్యంపాలవ్వడంతో.. తల్లిదండ్రులు సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు.. సామూహిక అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ నెల 15న జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు.. కేసును కూకట్‌పల్లి స్టేషన్‌కు బదిలీ చేశారు. కూకట్‌పల్లి పోలీసులు.. జోసెఫ్‌, నవీన్‌రెడ్డి, రామును అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు.

Updated Date - 2020-10-17T07:06:22+05:30 IST