చిన్న పట్టణాల్లోను ప్రీమియం ఫోన్లకు గిరాకీ
ABN , First Publish Date - 2022-08-19T05:53:34+05:30 IST
ఆమోదయోగ్యమైన ధరతో పాటు అత్యాధునిక, తాజా టెక్నాలజీలతో కూడిన స్మార్ట్ఫోన్లను వినియోగదారులు కోరుకుంటున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కొనుగోలుదారుల సైతం ఆధునిక స్మార్ట్ ఫోన్లను..
సామ్సంగ్ సీనియర్ డైరెక్టర్ ఆదిత్య వెల్లడి
హైదరాబాద్ మార్కెట్లోకి గెలాక్సీ జెడ్ సిరీస్ కొత్త ఫోన్లు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆమోదయోగ్యమైన ధరతో పాటు అత్యాధునిక, తాజా టెక్నాలజీలతో కూడిన స్మార్ట్ఫోన్లను వినియోగదారులు కోరుకుంటున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కొనుగోలుదారుల సైతం ఆధునిక స్మార్ట్ ఫోన్లను కోరుకుంటున్నారు. ఈ పట్టణాల్లో ప్రీమియం మొబైల్ ఫోన్లకు గిరాకీ పెరుగుతోందని సామ్సంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్, ప్రొడక్ట్ మార్కెటింగ్ అధిపతి ఆదిత్య బబ్బర్ తెలిపారు. విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజల కు తమ పనులు చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్ కీలకంగా మారుతోందని.. దీని వల్ల తమ అవసరాలకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారని వివరించారు.
ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల విభాగంలో నాలుగో తరం మొబైల్ ఫోన్లు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫోన్లను సామ్సంగ్ హైదరాబాద్లో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలాక్సీ సిరీ్సలోని ఫోల్డ్ 4, ఫ్లిప్ 4 ఫోన్లను ముందుగా బుక్ చేసుకున్న వారికి ఈ నెల 27 నుంచి, స్టోర్లలో కొనుగోలు చేసే వారికి వచ్చే నెల 2 నుంచి డెలివరీ చేయనున్నట్లు చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతో సహా దేశవ్యాప్తంగా 10,000 స్టోర్లలో (డీలర్ నెట్వర్క్) ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.
ఫోల్డ్ 4 ధర రూ.1,54,999 నుంచి: సరికొత్త స్నాప్డ్రాగన్ 8+ జెన్1 ప్రాసెసర్తో ఫోల్డ్ 4 ఫోల్డబుల్ ఫోన్ను విడుదల చేశారు. 50 ఎంపీ వైడ్లెన్స్ 50ఎంపీ ఫ్లాగ్షిప్ కెమెరా, రాత్రి సమయంలో కూడా మెరుగైన ఫోటోలు, వీడియోల కోసం నైటోగ్రాఫీ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
12జీబీ+256 జీబీతో కూడిన ఫోన్ ధర రూ.1,54,999 కాగా.. 12జీబీ+512 జీబీ ఫోన్ ధర రూ.1,64,999. 12జీబీ+1టీబీ వేరియంట్ ధర రూ.1,84,999 అని కంపెనీ తెలిపింది. వేరియంట్ను బట్టి ఫ్లిప్ 4 మొబైల్ ఫోన్ ధర రూ.89,999 నుంచి రూ.97,999 మధ్యన ఉన్నాయి.