ఎస్బీఐ కార్డ్ చెల్లింపులకు మరింత గడువు
ABN , First Publish Date - 2020-09-14T05:55:31+05:30 IST
మారటోరియం గడువు ముగిసినా క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించని ఖాతాదారులకు మరింత గడువు ఇవ్వాలని ఎస్బీఐ కార్డ్స్ భావిస్తోంది.
ఖాతాదారులకు రెండు ఆప్షన్లు
న్యూఢిల్లీ: మారటోరియం గడువు ముగిసినా క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించని ఖాతాదారులకు మరింత గడువు ఇవ్వాలని ఎస్బీఐ కార్డ్స్ భావిస్తోంది. చెల్లింపుల్లో విఫలమైన ఖాతాదారులు.. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించిన రుణ పునర్ వ్యవస్థీకరణ పథకం లేదా కంపెనీ ప్రకటించిన రీపేమెంట్ గడువును ఎంచుకోవచ్చని ఎస్బీఐ కార్డ్స్ ఎండీ, సీఈఓ అశ్వినీ కుమార్ తివారీ వెల్లడించారు. రెండింటిలోనూ ఆకర్షణీయమైన ‘వడ్డీ’ రేటు ఉంటుందన్నారు.
అయితే కంపెనీ ప్రకటించే రీపేమెంట్ పథకాన్ని ఎంచుకుంటే.. మారటోరియం గడువు ముగిసినా క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించని ఖాతాదారుల వివరాలు ‘సిబిల్’కు చేరవన్నారు. అలా చేయడం వల్ల వారి పరపతి రేటింగ్కు ఎలాంటి ఢోకా ఉండదని తివారీ చెప్పారు.
ఇంకా అనిశ్చితే: కొవిడ్ నేపథ్యంలో భవిష్యత్ ఇంకా అనిశ్చితంగా ఉందని తివారీ చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభానికి పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. సెప్టెంబరుతో ముగిసే రెండో త్రైమాసికం కష్టంగానే ఉంటుందన్నారు. కొవిడ్, లాక్డౌన్ల కారణంగా ఎన్పీఏల భారంతో కేటాయింపుల పోటు తప్పకపోవచ్చన్నారు.