పటిష్ఠ స్థితిలో..
ABN , First Publish Date - 2021-09-06T08:22:13+05:30 IST
నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. శార్దూల్ ఠాకూర్ (60), రిషబ్ పంత్ (50) అర్ధసెంచరీలతో ఏడో వికెట్కు 100 పరుగుల భాగస్వామ్యం అందించగా..
భారత్ రెండో ఇన్నింగ్స్ 466
శార్దూల్, పంత్ హాఫ్ సెంచరీలు
ఇంగ్లండ్ లక్ష్యం 368
ప్రస్తుతం 77/0
లండన్: నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. శార్దూల్ ఠాకూర్ (60), రిషబ్ పంత్ (50) అర్ధసెంచరీలతో ఏడో వికెట్కు 100 పరుగుల భాగస్వామ్యం అందించగా.. భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. దీంతో 367 పరుగుల ఆధిక్యంతో తిరుగులేని స్థితిలో నిలిచింది. చివరి నలుగురు బ్యాట్స్మెన్ 154 పరుగులు అందించడం విశేషం. ఆ తర్వాత భారీ ఛేదనలో ఇంగ్లండ్ కూడా దీటుగానే బదులిస్తోంది. నాలుగో రోజు ముగిసే సమయానికి 32 ఓవర్లలో వికెట్ నష్టపో కుండా 77 రన్స్ చేసింది. క్రీజులో హ మీద్ (43 బ్యాటింగ్), బర్న్స్ (31 బ్యాటింగ్) ఉన్నారు. ఆటకు నేడు చివరి రోజు. ఇంగ్లండ్ ఇంకా 291 రన్స్ చేయాల్సి ఉండగా మరో 90 ఓవర్ల ఆట మిగిలి ఉంది. తొలి సెషన్లో భారత్ వీలైనన్ని వికెట్లు తీయగలిగితే ఇంగ్లండ్పై ఒత్తిడి పెరుగుతుంది. అయితే పిచ్ బ్యాటింగ్కు అను కూలిస్తుండడంతో ఆతిథ్య జట్టు విజయం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. ఓవల్ మైదానంలో 263 పరుగుల ఛేదనే అత్యధికం కావడం గమనార్హం.
తడబాటు:
తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు ఆధిపత్యం చూపారు. 270/3 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ బ్రేక్ సమయానికే మూడు వికెట్లు కోల్పోయింది. ఆరంభంలో కోహ్లీ, జడేజా (17) మెరుగ్గానే ఆడి వికెట్ను కాపాడుకున్నారు. అండర్సన్ ఓవర్లలో కోహ్లీ కళ్లు చెదిరే కవర్ డ్రైవ్స్తో ఆకట్టుకున్నాడు. ఈ దశలో వోక్స్.. జడేజా, రహానె (0) వికెట్లు తీశాడు. కాసేపటికే కోహ్లీ స్పిన్నర్ అలీ ఓవర్లో డిఫెన్స్ ఆడాలని చూసి స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు. దీంతో పది ఓవర్ల వ్యవధిలోనే జ ట్టు మూడు వికెట్లను కోల్పోయింది.
పంత్, శార్దూల్ అదుర్స్:
రెండో సెషన్లో పంత్, శార్దూల్ ఇంగ్లండ్ బౌలర్లను విసిగించారు. చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ వేగంగా ఆధిక్యాన్ని పెం చారు. రాబిన్సన్ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన శార్దూల్ వరుసగా రెండో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతడి ఫోర్తోనే జట్టు స్కోరు 400.. ఆధిక్యం 300కి చేరింది. కానీ వరుస ఓవర్లలో ఈ ఇద్దరూ పెవిలియన్కు చేరారు. రూట్ ఓవర్లో శార్దూల్ స్లిప్లో క్యాచ్ ఇవ్వగా.. అర్ధసెంచరీ పూర్తి చేసిన పంత్ ఆ వెంటనే మొయిన్ అలీకి రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. వీరి మధ్య ఏడో వికెట్కు 100 పరుగుల భాగస్వామ్యం సమకూరింది. ఇక ఉమేశ్ (25), బుమ్రా (24) కూడా అంత సులువుగా లొంగకుండా బౌండరీలతో చెలరేగి తొమ్మిదో వికెట్కు 36 పరుగులు జోడించారు. చివరి సెషన్ 20 నిమిషాల్లోపే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆరంభంలోనే బుమ్రా వెనుదిరిగినా ఉమేశ్ మాత్రం 4, 6 బాది జట్టు ఆధిక్యాన్ని 367 పరుగులకు చేర్చి అవుటయ్యాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్:
191; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (సి) వోక్స్ (బి) రాబిన్సన్ 127; రాహుల్ (సి) బెయిర్స్టో (బి) అండర్సన్ 46; పుజార (సి) అలీ (బి) రాబిన్సన్ 61; కోహ్లీ (సి) ఒవర్టన్ (బి) అలీ 44; జడేజా (ఎల్బీ) వోక్స్ 17; రహానె (ఎల్బీ) వోక్స్ 0; పంత్ (సి అండ్ బి) అలీ 50; శార్దూల్ (సి) ఒవర్టన్ (బి) రూట్ 60; ఉమేశ్ (సి) అలీ (బి) ఒవర్టన్ 25; బుమ్రా (సి) అలీ (బి) వోక్స్ 24; సిరాజ్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు: 9; మొత్తం: 148.2 ఓవర్లలో 466 ఆలౌట్. వికెట్ల పతనం: 1-83, 2-236, 3-237, 4-296, 5-296, 6-312, 7-412, 8-414, 9-450, 10-466. బౌలింగ్: అండర్సన్ 33-10-79-1; రాబిన్సన్ 32-7- 105-2; వోక్స్ 32-8-83-3; ఒవర్టన్ 18.2-3-58-1; అలీ 26-0-118-2; రూట్ 7-1-16-1.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్:
బర్న్స్ (బ్యాటింగ్) 31; హమీద్ (బ్యాటింగ్) 43; ఎక్స్ట్రాలు: 3; మొత్తం: 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 6-2-13-0; బుమ్రా 7-3-11-0; జడేజా 13-4-28-0; సిరాజ్ 6-0-24-0.