సైన్యంలో..న్యాయంలో మహిళలకు జస్టిస్‌

ABN , First Publish Date - 2021-08-19T08:17:58+05:30 IST

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు రానున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం వారి పేర్లను బుధవారం కేంద్ర

సైన్యంలో..న్యాయంలో మహిళలకు జస్టిస్‌

సుప్రీం న్యాయమూర్తులుగా మరో ముగ్గురు మహిళలు..

తెలంగాణ హైకోర్టుకు నలుగురు

రాష్ట్ర హైకోర్టుకు మొత్తం ఏడుగురు జడ్జిలు

కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసు

ఆ ఏడుగురిలో నలుగురు మహిళలే


ఆకాశంలో సగం.. ఇక న్యాయవ్యవస్థలోనూ, ఆర్మీలోనూ  చెప్పుకోదగ్గ భాగం కానున్నారు. భారత సర్వోన్నత న్యాయస్థానంలో తొలిసారి ఏకకాలంలో నలుగురు మహిళా న్యాయమూర్తులు కొలువుదీరనున్నారు. సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది జడ్జిలను సిఫారసు చేసిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం.. వారిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులకు చోటు కల్పించింది. తెలంగాణ హైకోర్టుకు కొలీజియం సిఫారసు చేసిన ఏడుగురు కొత్త జడ్జిల్లోనూ నలుగురు మహిళా న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదించింది.  అంతేకాదు.. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ద్వారా సైన్యంలో చేరేందుకు పురుషులకు కల్పించినట్లుగానే మహిళలకూ అవకాశం కల్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. 


న్యూఢిల్లీ, హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు రానున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం వారి పేర్లను బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన ఏడుగురిలో నలుగురు మహిళా న్యాయాధికారులే కావడం విశేషం. కొలీజియం సిఫారసు చేసినవారి పేర్లు.. పి.మాధవి దేవి, జి.రాధారాణి, పి.శ్రీసుధ, సి.సుమలత, ఎం.లక్ష్మణ్‌, ఎన్‌.తుకారాంజీ, ఎ.వెంకటేశ్వర రెడ్డి. సుప్రీం కోర్టు కొలీజియంలో జస్టిస్‌ ఎన్వీ రమణతో పాటు జస్టిస్‌ ఉదయ్‌ యూ లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర రావు సభ్యులుగా ఉన్నారు.


ఇవీ నేపథ్యాలు..

పి.మాధవీ దేవి: ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ న్యాయ సభ్యురాలుగా వ్యవహరిస్తున్న పి.మాధవీ దేవి.. 1965 డిసెంబరు 28న హైదరాబాద్‌లో జన్మించా రు. బీకామ్‌, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసిన ఆమె 1992 నుంచి 2005 వరకు న్యాయవాదిగా ప్రాక్టిస్‌ చేశారు. 2005 మార్చి 1న సర్వీసులో చేరారు.


పి.శ్రీసుధ: ప్రస్తుతం కో-ఆపరేటివ్‌ సొసైటీ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న పి.శ్రీసుధ 1967 జూన్‌ ఆరున జన్మించారు. నిజామాబాద్‌ అడిషనల్‌ జిల్లా జడ్జిగా ఆమె మొదటి నియామకం జరిగింది. విజయవాడ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా, ఆ తర్వాత విశాఖపట్నం జిల్లా జడ్జిగా పని చేశారు. వరంగల్‌ జిల్లా జడ్జిగా, ఆ తర్వాత జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఆమె వ్యవహరించారు. సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా.. ఆపై నిజామాబాద్‌ ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తించారు. జిల్లా జడ్జిల్లో ఆమె సీనియర్‌ మోస్ట్‌.


జి.రాధారాణి: డాక్టర్‌ జి. రాధారాణి 1963 జూన్‌ 29న జన్మించారు. లా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాక హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం చేశారు. అనంతరం ఉస్మానియాలోనే పీహెచ్‌డీ పూర్తి చేశారు. నేషనల్‌ లా బోర్డులో మానవహక్కుల మీద, ఉస్మానియాలో ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌పై డిప్లొమా చేశారు. పదేళ్ల పాటు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా.. అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా  హైదరాబాద్‌లో పని చేశారు. 2008లో జిల్లా జడ్జిగా నేరుగా ఎంపికయ్యారు. ఒంగోలు, హైదరాబాద్‌, సంగారెడ్డి, సికింద్రాబాద్‌లలో జిల్లా జడ్జిగా వివిధ హోదాల్లో పని చేశారు. పదోన్నతిలో భాగంగా నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. హైదరాబాద్‌లో మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా పనిచేశారు. తెలంగాణ వ్యాట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. మానవవాదిగా సుపరిచితులు.


డాక్టర్‌ సి. సుమలత:హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ సి.సుమలత 1972 ఫిబ్రవరి 5న జన్మించారు. 2005లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఆమె తొలిసారి నియమితులయ్యారు. ఆ వెంటనే జిల్లా జడ్జి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 2007 అక్టోబరు 25న జిల్లా జడ్జిగా మదనపల్లిలో బాధ్యతలు చేపట్టారు. కర్నూలు, గుంటూరులో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఉమ్మడి రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా పని చేశారు. రెండేళ్ల క్రితం సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం అక్కడే పని చేస్తున్నారు. ‘సత్వర న్యాయం’ అనే అంశంపై పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్‌ పొందారు.


ఎ.వెంకటేశ్వరరెడ్డి: ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా పనిచేస్తున్న ఎ.వెంకటేశ్వరరెడ్డి 1961 ఏప్రిల్‌ 15న జన్మించారు. 1994 మే ఐదున జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమితులయ్యారు. రాష్ట్రంలో వివిధ స్థాయుల్లో పనిచేశారు.


ఎం.లక్ష్మణ్‌: నాంపల్లి లేబర్‌ కోర్టు నం.1 ప్రిసైడింగ్‌ అధికారిగా కొనసాగుతున్న ఎం.లక్ష్మణ్‌ 1965 డిసెంబరు 24న జన్మించారు. ఉస్మానియా వర్సిటీలో న్యాయవాద విద్యను అభ్యసించిన ఆయన 1991లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా, సిటీ సివిల్‌కోర్టుల్లో ప్రాక్టీస్‌ కొనసాగించారు. న్యాయమూర్తుల నియామకానికి నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి అదనపు జిల్లా జడ్జి(ఏడీజే)గా ఎంపికయ్యారు. 2008లో మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టులో ఏడీజేగా నియమితులయ్యారు. ఆ తర్వాత నిజామాబాద్‌, జిల్లా కోర్టుల్లో ఏడీజేగా, హైదరాబాద్‌ ఆర్థిక నేరాల కోర్టులో స్పెషల్‌ జడ్జిగా పనిచేశారు. 2016లో జిల్లా ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జిగా పదోన్నతి పొంది.. వరంగల్‌, ఖమ్మంలో బాధ్యతలు నిర్వహించారు.


ఎన్‌.తుకారాంజీ: నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఎన్‌.తుకారాంజీ 1973 ఫిబ్రవరి 24న జన్మించారు. విశాఖపట్నంలో అదనపు జిల్లా జడ్జిగా తొలి పోస్టింగ్‌. ఏలూరు, కాకినాడలో అదనపు జిల్లా జడ్జిగా వ్యవహరించారు. అనంతరం ఏలూరు ప్రిన్సిపల్‌ డ్రిస్ట్రిక్ట్‌ జడ్జిగా పని చేశారు. 


Updated Date - 2021-08-19T08:17:58+05:30 IST