వీరూ.. అదే జోరు
ABN , First Publish Date - 2021-03-06T09:13:48+05:30 IST
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి ఆరేళ్లయినా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్లో జోరు ఏమాత్రం తగ్గలేదు.
తొలి మ్యాచ్లో ఇండియా లెజెండ్స్ విజయం
రాయ్పూర్: అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి ఆరేళ్లయినా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్లో జోరు ఏమాత్రం తగ్గలేదు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో సెహ్వాగ్ (35 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతడికి టెండూల్కర్ (26 బంతుల్లో 5 ఫోర్లతో 33 నాటౌట్) కూడా జత కలిశాడు. దాంతో బంగ్లాదేశ్ లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో సచిన్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ 10 వికెట్లతో నెగ్గింది. తొలుత బంగ్లాదేశ్ లెజెండ్స్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ నజీముద్దీన్ (49) టాప్ స్కోరర్. పేసర్ వినయ్ కుమార్, స్పిన్నర్లు ప్రజ్ఞాన్ ఓఝా, యువరాజ్ సింగ్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేదనలో వీరూ విరుచుకుపడడంతో ఇండియా లెజెండ్స్ కేవలం 10.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేసి అలవోకగా నెగ్గింది. మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఈ సిరీస్ ఈనెల 21న జరిగే ఫైనల్తో ముగియనుంది.