మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-26T09:44:42+05:30 IST

సీనియర్‌ రాజకీయవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే, గురుదక్షిణ ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ చేకూరి కాశయ్య (88) కన్నుమూశారు.

మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య కన్నుమూత

ఖమ్మం/కొత్తగూడెం, మే 25 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): సీనియర్‌ రాజకీయవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే, గురుదక్షిణ ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ చేకూరి కాశయ్య (88) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని కుమారుడి నివాసంలో ఉంటున్న ఆయన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు. కాశయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.  1958-60మధ్య ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన 1960లో కొత్తగూడెం పంచాయతీ సమితిలో విస్తరణ అధికారిగా ప్రభుత్వ ఉద్యోగం చేసి.. 1964లో రాజకీయాల్లోకి వచ్చారు. అదే సంవత్సరం కొత్తగూడెం సమితి అధ్యక్షుడిగా ఎన్నికవగా.. 1972లో కొత్తగూడెం నుంచి ఎమ్మల్యేగా ఎన్నికయ్యారు. 1978లో జనతా పార్టీ తర పున పోటీ చేసి గెలిచారు. 1987లో ఖమ్మం జిల్లా ప్రజాపరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాశయ్య అంత్యక్రియలు మంగళవారం ఖమ్మంలోని గురుదక్షిణ ఫౌండేషన్‌ ఆవరణలో నిర్వహించారు. 


ఉపరాష్ట్రపతి, సీఎం కేసీఆర్‌ సంతాపం

చేకూరి కాశయ్య మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సంతాపం ప్రకటించారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా చేకూరి కాశయ్య తనకు సుపరిచితులని, గాంధీ సిద్ధాంతాలను పాటిస్తూ ఖద్దరు ధరించడమే కాక ఎంతో సౌమ్యంగా ఉండేవారని, తన పట్ల ఎంతో అభిమానంచూపేవారని ఉపరాష్ట్రపతి తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. కాశయ్య మృతి అందరికీ తీరని లోటని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు.  కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాశయ్య మరణం బాధాకరమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కాశయ్య మృతికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క,  బీజేపీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, మాజీఎమ్మెల్యే, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు తదితరులు సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-05-26T09:44:42+05:30 IST