మాజీ మంత్రి మాతంగి నర్సయ్య మృతి
ABN , First Publish Date - 2020-09-02T09:52:50+05:30 IST
మాజీ మంత్రి మాతంగి నర్సయ్య (75) మంగళవారం మృతిచెందారు. నెల క్రితం కరోనా సోకిన ఆయన ఆగస్టు 17వ తేదీన నెగిటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే, వయోభారం నేపథ్యంలో
- నెల క్రితం కరోనా.. నెగెటివ్తో డిశ్చార్జి
- అనంతరం శరీరంలో ఇనెక్ఫన్లతో ఆస్పత్రికి..
- అఖిల భారత గుడిసెల సంఘం వ్యవస్థాపకుడు
- ఇటీవలే కొవిడ్తో భార్య కన్నుమూత
గోదావరిఖని, సెప్టెంబరు 1: మాజీ మంత్రి మాతంగి నర్సయ్య (75) మంగళవారం మృతిచెందారు. నెల క్రితం కరోనా సోకిన ఆయన ఆగస్టు 17వ తేదీన నెగిటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే, వయోభారం నేపథ్యంలో శరీరంలో ఇన్ఫెక్షన్లు పెరిగాయి. ఆగస్టు 26న హైదరాబాద్లోని ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి చనిపోయారు నర్సయ్య భార్య జోజమ్మ కరోనాతో ఆగస్టు 15న మృతి చెందారు. నర్సయ్య కరీంనగర్ జిల్లా మేడారం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో తొలిసారి టీడీపీ తరఫున ఎన్నికై అనంతరం నాదెండ్ల భాస్కర్రావు వర్గంలోకి వెళ్లారు. సంక్షేమ మంత్రిగా పనిచేశారు. 1989లో కాంగ్రెస్, 1999లో టీడీపీ నుంచి విజయం సాధించారు. రెండుసార్లు పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఓడిపోయారు. నర్సయ్య బ్యాంక్ క్యాషియర్గా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావానికి ముందే.. ఎస్సీల్లో మాదిగలు, ఉప కులాలకు హక్కులు దక్కడం లేదంటూ అరుంధతి మహాసభ పేరిట ఆందోళనలు చేశారు. అఖిల భారత గుడిసె (హట్స్)ల సంఘం స్థాపించి పేదలకు ఇళ్ల స్థలాల మంజూరుకు పోరాడారు.