మ్యాచ్లో పిడుగుపాటు ఫుట్బాలర్ మృతి
ABN , First Publish Date - 2020-09-20T09:06:48+05:30 IST
ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా పిడుగుపడి ఓ ఆటగాడు మరణించిన విషాద ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో చోటు చేసుకుంది.
రాంచీ: ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా పిడుగుపడి ఓ ఆటగాడు మరణించిన విషాద ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో చోటు చేసుకుంది. రాంచీకి 120 కి.మీ. దూరంలో మావోయిస్టు ప్రభావిత మారుమూల గ్రామం ఉరుబార్డి. ఇక్కడ గురువారం మధ్యాహ్నం జరిగిన నెమాన్ కుజుర్ ఫుట్బాల్ చాంపియన్షిప్లో భాగంగా మ్యాచ్ జరిగింది. పోటీ మధ్యలో వర్షం మొదలైనా మ్యాచ్ను కొనసాగించారు. ఇంతలో పెద్ద శబ్దంతో పిడుగు పడడంతో పరాస్ పన్నా అనే యువ ఆటగాడితోపాటు మరో నలుగురు గాయపడ్డారు. వీరిని గుమ్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా..పరాస్ అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఉదంతం గురించి శుక్రవారం సమాచారం అందుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించారు. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా మ్యాచ్ నిర్వహించడంపై విచారణ జరుపుతున్నట్టు చైన్పూర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి కుల్దీప్ కుమార్ తెలిపారు.