పంచాయతీ ట్రైబ్యునల్‌ తొలి తీర్పు

ABN , First Publish Date - 2020-08-13T08:08:59+05:30 IST

పంచాయతీరాజ్‌ చట్టం-2018ను అనుసరించి ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర

పంచాయతీ ట్రైబ్యునల్‌ తొలి తీర్పు

  • అచ్చ తెలుగులో ఆదేశాలు జారీ
  • అంబాల సర్పంచ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

హైదరాబాద్‌, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ చట్టం-2018ను అనుసరించి ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ ట్రైబ్యునల్‌ తన తొలి తీర్పును బుధవారం వెల్లడించింది. తీర్పును పూర్తిగా తెలుగులోనే వెలువరించడం గమనార్హం. ఈ ట్రైబ్యునల్‌కు ఛైర్మన్‌గా బండారు భాస్కర్‌, సభ్యులు పులిగారి గోవర్థన్‌ రెడ్డి, గటిక అజయ్‌ కుమార్‌లతో కూడిన కమిటీని గత నవంబరులో నియమించారు. ఈ ట్రైబ్యునల్‌ తన వద్దకు వచ్చిన వరంగల్‌ అర్బన్‌ జిల్లా అంబాల గ్రామ సర్పంచ్‌(సస్పెన్షన్‌) శ్రీరాముల లింగమూర్తి చేసుకున్న పిటిషన్‌ను విచారించి, ఈ మేరకు తీర్పునిచ్చింది. లింగమూర్తిని సర్పంచ్‌ పదవి నుంచి సస్పెండ్‌ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వును రద్దు పరుస్తూ, అతనికి తిరిగి సర్పంచ్‌గా బాధ్యతలను అప్పగించాలని పంచాయతీరాజ్‌ శాఖాధికారులు, కలెక్టర్‌ను ఆదేశించింది. లింగమూర్తి నిర్దోషి అని, అతనిపై ఆరోపణలు నిరాధారమని పేర్కొంది. రాజకీయ దురుద్ధేశంతోనే లింగమూర్తిపై ఫిర్యాదులు చేశారని, గ్రామ ప్రజల హితాన్ని మరిచి, సర్పంచ్‌ను ఇబ్బందులు పెట్టాలన్న లక్ష్యంతోనే వాటిని చేశారని ట్రైబ్యునల్‌ భావించింది. 

Updated Date - 2020-08-13T08:08:59+05:30 IST