వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2022-02-05T16:35:35+05:30 IST
దిండుగల్ జిల్లా గోపాలపట్టిలోని బహుళ అంతస్తుల వస్త్ర దుకాణంలో గురువారం అర్ధరాత్రి సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో రూ.2 కోట్ల మేర ఆస్తినష్టం సంభవించింది. దుస్తులు, ఏసీ పరికరాలు, ఫర్నిచర్, ఇతర వస్తు
- రూ.2కోట్ల ఆస్తి నష్టం
చెన్నై: దిండుగల్ జిల్లా గోపాలపట్టిలోని బహుళ అంతస్తుల వస్త్ర దుకాణంలో గురువారం అర్ధరాత్రి సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో రూ.2 కోట్ల మేర ఆస్తినష్టం సంభవించింది. దుస్తులు, ఏసీ పరికరాలు, ఫర్నిచర్, ఇతర వస్తువులు బుగ్గి పాలయ్యాయి. గోపాలపట్టి నత్తం రోడ్డులో చంద్రశేఖర్ అనే వ్యాపారి ‘విష్ణుదేవి టెక్స్టైల్స్’ పేరుతో నడుపుతున్న వస్త్ర దుకాణంలో వందమందికి పైగా సిబ్బంది పనిచేస్తుంటారు. గురువారం రాత్రి పది గంటలకు ఆ దుకాణాన్ని మూసివేసి సిబ్బంది వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఆ దుకాణంలో నుండి దట్టమైన పొగతో మంటలు చెలరేగాయి. డ్యూటీలో ఉన్న వాచ్మెన్ గమనించి వెంటనే దుకాణం యజమాని చంద్రశేఖర్కు ఫోన్చేసి తెలిపాడు. వెంటనే ఆయన పోలీసులు, అగ్నిమాపక అధికారులకు ఫిర్యాదు చేశారు. కొద్దిసేపటికే దుకాణం మొత్తం మంటలు వ్యాపించి రెడీమేడ్ దుస్తులు, పట్టు చీరలు, ధోవతులు, ఏసీ యంత్రాలు, ఫర్నిచర్ మొత్తం కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది దిండుగల్, నత్తం ప్రాంతాల నుంచి ఫైరింజన్లతో వెళ్ళి సుమారు నాలుగు గంటల సేపు పోరాడినా ఫలితం లేకపోయింది. అప్పటికే దుకాణంలోని వస్తువులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు పోలీసులు అంచనా వేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానించి, సారనార్ పట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతు న్నారు.
ఎలక్ట్రికల్ షాపులో...
సేలం జిల్లా ఎడప్పాడి సమీపం ఎట్టికుట్టైమేడు ప్రాంతంలో శబరినాధన్ అనే వ్యక్తి నడుపుతున్న ఎలక్ట్రికల్ షాపులో శుక్రవారం వేకువజాము సంభ వించిన అగ్నిప్రమాదంలో లక్షలాది రూపాయల విలువైన వస్తువులు, ఫర్నిచర్ కాలిబూడిదయ్యాయి. తొలుత ఆ దుకాణం వైనుక గది నుంచి దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో వెళ్ళి సుమారు మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. షాపు యజమాని శబరినాథన్ అగ్నిప్రమాదానికి తన బంధువులు కారణమై ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంగనాపురం పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.