జొరమొచ్చింది!

ABN , First Publish Date - 2022-01-22T07:13:36+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వైద్య

జొరమొచ్చింది!

  • 57,013 మందికి ఫీవర్‌
  • తొలి రోజు సర్వేలో గుర్తింపు
  • 56,466 మందికి మందుల కిట్ల పంపిణీ
  • రాష్ట్రంలో 5 రోజుల పాటు సాగనున్న సర్వే
  • ఒక్కో బృందం 25 ఇళ్లకు వెళ్లేలా ఏర్పాట్లు
  • వ్యాక్సిన్‌ తీసుకోకుంటే అప్పటికప్పుడే టీకా
  • జ్వర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరా
  • మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
  • కొవిడ్‌ పరిస్థితులపై ప్రగతి భవన్‌లో సమీక్ష


హైదరాబాద్‌/న్యూస్‌ నెట్‌వర్క్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జ్వర సర్వే ప్రారంభమైంది. ఈ మేరకు తొలి రోజే 33 జిల్లాల్లో 57,013 మంది జ్వర బాధితులను గుర్తించారు. అందులో 56,466 మందికి హోమ్‌ ఐసొలేషన్‌ కిట్లు పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మెదక్‌, జనగామ, హన్మకొండ జిల్లాల్లో సగటున రెండు వేలకుపైగా జ్వర బాధితులను గుర్తించారు. రెండో వేవ్‌లో మూడు, నాలుగు దఫాలుగా ఫీవర్‌ సర్వే నిర్వహించగా మంచి ఫలితాలు వచ్చాయి.


ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల పాటు ఫీవర్‌ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా వేలాది బృందాలు రంగంలోకి దిగాయి. పల్లెలు, పట్టణాలను వైద్య సిబ్బంది జల్లెడ పడుతున్నారు. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులు ఉండేలా ఏర్పాట్లు చేశారు. గ్రామపంచాయతీల్లో ఆశా వర్కర్‌, అంగన్‌వాడీ టీచర్‌, గ్రామపంచాయతీ కార్యదర్శి, మునిసిపాలిటీల్లో రిసోర్స్‌ పర్సన్‌, బూత్‌లెవల్‌ ఆఫీసర్లు, వీఆర్‌వోలు సర్వేలో పాల్గొంటున్నారు. పర్యవేక్షణ నిమిత్తం మండలానికో ప్రత్యేక అధికారిని నియమించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు స్వయంగా ఫీవర్‌ సర్వేను పర్యవేక్షిస్తున్నారు.


ఒక్కో బృందం కనీసం రోజుకు 25 కుటుంబాలను సర్వే చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఈ బృందాలు నిర్దేశించుకున్న ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నాయి. ఈ మేరకు జ్వరం ఉంటే వారం పాటు హోంఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. లక్షణాలున్న ప్రతి ఒక్కరికి హోం ఐసోలేషన్‌ కిట్‌ అందజేస్తున్నారు. అలాగే టీకా తీసుకున్నారా? లేదా? తీసుకుంటే ఎన్ని రోజులైందన్న విషయాలను సేకరిస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోని వారుంటే.. అప్పటికప్పుడే టీకా ఇస్తున్నారు. నిర్మల్‌ జిల్లాలో సర్వేలో భాగంగా శుక్రవారం వెయ్యి మందికి వ్యాక్సిన్‌ వేశారు.


ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే జలుబు, దగ్గు ఉన్న వారికి యాంటీజెన్‌ టెస్టులు, జ్వరం ఉన్న వారికి మలేరియా టెస్టులు చేస్తున్నారు. అయితే, జ్వర సర్వేలో భాగంగా అన్ని చోట్లా యాంటీజెన్‌ టెస్టులు చేస్తే బాగుండేదన్న అభిప్రాయాలను వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. లక్షణాలున్న వారికి కిట్లను ఇచ్చే బదులు అప్పటికప్పుడు పరీక్షించి, వైరస్‌ నిర్ధారణ అయితే దానికి తగ్గట్టుగా వైద్యం అందిస్తే మంచి ఫలితాలుంటాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 



ఆందోళన అవసరం లేదు: సీఎస్‌

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఫీవర్‌ సర్వే ప్రారంభించినట్లు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఖైరతాబాద్‌లోని హిట్‌ టాప్‌ కాలనీలో ఫీవర్‌ సర్వే జరుగుతున్న తీరును అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.


ఈ సందర్భంగా సోమేశ్‌ మాట్లాడుతూ కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే కోటికి పైగా మెడికల్‌ కిట్లను సిద్ధంగా ఉంచామని, రోజుకు లక్ష పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 56 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 4846 కాలనీల్లో, బస్తీల్లో ఇంటింటి సర్వే ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంపీ కమిషనర్‌ డి.ఎ్‌స.లోకేష్‌ కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ శర్మన్‌ పాల్గొన్నారు. 




ఫీవర్‌ సర్వేలో నిర్లక్ష్యం.. ముగ్గురిపై వేటు

సస్పెండ్‌ చేసిన నిర్మల్‌ కలెక్టర్‌ 

మరో ఇద్దరు అధికారులకు నోటీసులు 


రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అత్యంత సీరియ్‌సగా చేపట్టిన ఫీవర్‌ సర్వే ప్రక్రియలో నిర్లక్ష్యం చేసిన అధికారులు, సిబ్బందిపై నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ శుక్రవారం కొరడా ఝళిపించారు. శుక్రవారం జిల్లాలోని రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్‌ అధికారులు, సిబ్బంది అంతా ఇంటింటికీ తిరిగి జ్వర పీడితుల వివరాలు సేకరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఇందులో భాగంగానే జిల్లాలోని లోకేశ్వరం మండలం మన్మధ్‌ గ్రామాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.


అయితే ఇక్కడి సర్వేలో పంచాయతీ సెక్రటరీ, వీఆర్‌ఏ, పంచాయతీరాజ్‌ ఏఈ పాల్గొన లేదన్న ఫిర్యాదు రావడంతో కలెక్టర్‌ సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్‌ ఏఈ రఘువంశీ, పంచాయతీ సెక్రటరీ సుప్రియ, వీఆర్‌ఏ రవిని అక్కడికక్కడే సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ లోకేశ్వరం తహసీల్దార్‌ సరిత, ఎంపీడీవో దేవేందర్‌ రెడ్డికి షోకాజ్‌ నోటీసులిచ్చారు. ఆ తర్వాత కలెక్టర్‌ ముధోల్‌ మండలంలోని కొన్ని గ్రామాల్లో సైతం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.


  


మరింత అప్రమత్తంగా ఉండండి


అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం కొవిడ్‌ పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వైద్యశాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తి ఎలా ఉంది? రోజుకు ఎన్ని కేసులు వస్తున్నాయి? ఎందరికి ఆక్సిజన్‌ అవసరమవుతోంది? ఐసీయూలో ఎంతమంది ఉన్నారు? ఆస్పత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయా? వంటి అంశాలపై సీఎం ఆరా తీశారు.


రాష్ట్రవ్యాప్తంగా జ్వర సర్వే ఎలా జరుగుతుందని సీఎం అడిగి తెలుసుకున్నారు. హోం ఐసోలేషన్‌ కిట్లను సరిపడా ఉంచుకోవాలని ఆదేశించారు. కాగా, కొమార్బిడిటీ్‌సతో బాధపడే వారు మాత్రమే ఆస్పత్రుల్లో చేరుతున్నారని, రెండో వేవ్‌లో మాదిరిగా ఆక్సిజన్‌ అవసరం ఉండడం లేదని అధికారులు వివరించారు. పాజిటివ్‌ వచ్చిన వారు వైద్యం తీసుకొని ఇళ్ల వద్దనే ఉండేందుకు ఇష్టపడుతున్నారని, ఆస్పత్రుల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని వెల్లడించారు. 




జిల్లాల్లో తొలి రోజు  ఫీవర్‌ సర్వే ఇలా..

సిరిసిల్ల జిల్లాలో 478, మంచిర్యాల జిల్లాలో 485, ఖమ్మం జిల్లాలో 1539, జగిత్యాల జిల్లాలో 652, ఆసిఫాబాద్‌లో 742, మంచిర్యాలలో 485, ఆదిలాబాద్‌లో 1004, నిర్మల్‌ జిల్లాలో 654, వరంగల్‌లో 470, వికారాబాద్‌లో 754, పెద్దపల్లిలో 538, జనగామలో 311, ములుగు జిల్లాల్లో 240, మెదక్‌లో 532,  సిద్దిపేటలో 804,  కామారెడ్డిలో 879 బృందాలు ఫీవర్‌ సర్వేలో పాల్గొన్నాయి. 

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 44,968 ఇళ్లలో సర్వే చేయగా, 2854 మంది జర్వంతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. 

యాదాద్రి జిల్లాలో 500 కుటుంబాలకుగాను 75 మంది, సిద్దిపేట జిల్లాలో 28,772 కుటుంబాల్లో సర్వే చేయగా 625 మంది జ్వర బాధితులను గుర్తించారు. 

నల్లగొండ జిల్లాలో తొలిరోజు 58,440 కుటుంబాల్లో 2,041 మందికి దగ్గు, జలుబు ఉన్నట్లు తేలింది. 

మెదక్‌ జిల్లాలో 37,711 కుటుంబాలకుగాను 2,443 మందికి, జనగామ జిల్లాలో 45,525 ఇళ్లలో సర్వే చేసి 2194 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించారు. 

నిజామాబాద్‌లో 46,360 ఇళ్లలో సర్వే  చేసి... 1432 మంది బాఽధితులను గుర్తించి కిట్లు అందజేశారు. 

కరీంనగర్‌ జిల్లాలో 41,897 ఇళ్లల్లో సర్వే చేసి 969 మంది, ఆదిలాబాద్‌ జిల్లాలో 29,977 కుటుంబాల్లో సర్వే చేసి 706 మంది బాధితులను గుర్తించారు. 

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 697 మంది, రంగారెడ్డి జిల్లాలో 102 మంది, హన్మకొండ జిల్లాలో 4,397 మందికి హోం ఐసోలేషన్‌ కిట్లను అందజేశారు.


Updated Date - 2022-01-22T07:13:36+05:30 IST