కువైత్ సిటీ: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు భారత్కు అత్యంత కీలకమైన గల్ఫ్ దేశాల్లో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఖతర్, కువైత్, ఒమాన్, ఇరాన్ దేశాలు భారత రాయబారులను పిలిచి అధికారికంగా తమ నిరసన వ్యక్తం చేశాయి. ఆయా దేశాల్లో చాలా ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. ఈ క్రమంలో శుక్రవారం కువైత్లోని Fahaheel ప్రాంతంలో కొందరు ప్రవాసులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రార్థనల అనంతరం వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఇలా ప్రవాసులు బహిరంగ ప్రదర్శనకు దిగడం అక్కడి చట్టాల ఉల్లంఘన కిందికి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ప్రవాసులందరిని దేశం నుంచి బహిష్కరించనున్నట్లు స్పష్టం చేశారు.
కువైత్లో ప్రవాసులు సిట్ఇన్లు లేదా ప్రదర్శనలు నిర్వహించరాదనే నిబంధనలు ఆ దేశ చట్టాల్లో పొందుపరిచారు. ఈ నిబంధనలను ఉల్లంఘించినందున వారిని కువైత్ నుండి బహిష్కరిస్తున్నట్లు సంబంధిత అధికార వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం డిటెక్టివ్ అధికారులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నాయి. వారిని Deportation centerకు తరలించి అనంతరం అక్కడి నుంచి వారివారి దేశాలకు పంపించనున్నట్లు వెల్లడించారు. అంతేగాక ఇలా దేశ బహిష్కరణకు గురైన ప్రవాసులకు ఇకపై వారి జీవితంలో కువైత్లో అడుగుపెట్టకుండా నిషేధం విధించడం జరుగుతుందని తెలిపారు. దేశంలోని ప్రవాసులందరూ తప్పనిసరిగా కువైత్ చట్టాలను గౌరవించడంతో పాటు ఎలాంటి నిరసన ప్రదర్శనలలో పాల్గొనకూడదని ఈ సందర్భంగా కువైత్ అధికారులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి