ప్రవాసి.. ప్రాపర్టీ!
ABN , First Publish Date - 2021-04-11T06:15:16+05:30 IST
కరోనా సంక్షోభం దెబ్బకు గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో స్థిరాస్తి రంగం కుదేలైంది. ఈ గడ్డు కాలంలోనూ ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) దేశీయ రియల్టీ మార్కెట్లో 1,330 కోట్ల డాలర్ల (రూ.99,750 కోట్లు) విలువైన ప్రాపర్టీలు కొనుగోలు
దేశీయ ‘స్థిరాస్తి’లో ఎన్ఆర్ఐల పెట్టుబడుల జోరు
2021-22లో రూ.1.12 లక్షల కోట్లకు: 360 రియల్టర్స్
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం దెబ్బకు గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో స్థిరాస్తి రంగం కుదేలైంది. ఈ గడ్డు కాలంలోనూ ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) దేశీయ రియల్టీ మార్కెట్లో 1,330 కోట్ల డాలర్ల (రూ.99,750 కోట్లు) విలువైన ప్రాపర్టీలు కొనుగోలు చేశారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2019-20)తో పోలిస్తే స్థిరాస్తి మార్కెట్లోకి ఎన్ఆర్ఐల పెట్టుబడులు 6.4 శాతం పెరిగాయని 360 రియల్టర్స్ తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) లో వీరి పెట్టుబడులు మరో 12ు పెరిగి 1,490 కోట్ల డాలర్ల (రూ.1,11,750 కోట్లు)కు చేరుకోవచ్చని అంచనా వేసింది.
రెండో త్రైమాసికం నుంచి పుంజుకున్నాయ్: కొవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రియల్టీ మార్కెట్ కుప్పకూలింది. తత్ఫలితంగా స్థిరాస్తి రంగంలోకి ఎన్ఆర్ఐల పెట్టుబడులు వార్షిక ప్రాతిపదికన 35 శా తం పతనమయ్యాయి. రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబరు)లో మాత్రం 18 శాతం వృద్ధి నమోదు చేసుకున్నాయి. మూడో క్వార్టర్ (అక్టోబరు-డిసెంబరు)లో 24 శాతం, నాలుగో క్వార్టర్ (జనవరి-మార్చి)లో 22 శాతం పెరిగాయి.
గల్ఫ్ దేశాల నుంచే అధికం: గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఎన్ఆర్ఐ పెట్టుబడుల్లో 41 శాతం వాటా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న వారిదే. అమెరికాలోని భారతీయుల పెట్టుబడుల వాటా 17 శాతంగా నమోదు కాగా, సింగపూర్లో నివసిస్తున్న వారి పెట్టుబడుల వాటా 12 శాతంగా ఉంది. కెనడా, బ్రిటన్, జర్మనీ, కెన్యా, దక్షిణాఫ్రికాల్లో స్థిరపడిన భారతీయుల నుంచి పెట్టుబడులు వస్తున్నట్లు తెలిపింది.
దేశీయ స్థిరాస్తిలో ఎన్ఆర్ఐల పెట్టుబడులు
ఆర్థిక సంవత్సరం కోట్ల డాలర్లు
2013-14 600
2014-15 720
2015-16 850
2016-17 940
2017-18 970
2018-19 1,100
2019-20 1,250
2020-21 1,330
2021-22(అంచనా) 1,490