TS News: ఇచ్చేది గోరంత.. దోచుకునేది కొండంత: ఈటల రాజేందర్
ABN , First Publish Date - 2022-09-23T02:53:09+05:30 IST
టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చేది గోరంత అని.. దోచుకునేది మాత్రం కొండంత అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్
ఆదిలాబాద్: టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చేది గోరంత అని.. దోచుకునేది మాత్రం కొండంత అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా గోస.. బీజేపీ భరోసా’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పింఛన్ తదితర సంక్షేమ పథకాలకు రూ.25వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోందన్నారు. కానీ ఆర్టీసీ టికెట్లు, రిజిస్ర్టేషన్ ఫీజులు, మద్యం.. తదితర వాటి ద్వారా సంవత్సరానికి రూ.42 వేల కోట్లు ఆదాయాన్ని పొందుతోందన్నారని తెలిపారు. అయినప్పటికీ రైతులకు రుణమాఫీ చేయకపోగా కౌలు రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్ర ప్రజలకు శుద్ధజలం రాకపోగా.. ఈ పథకం ద్వారా రూ.40వేల కోట్లు వృథా అయ్యాయని విమర్శించారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూంలు, దళిత పథకం ద్వారా 3 ఎకరాల భూమి అందడం లేదని ఈటల రాజేందర్ విమర్శించారు.