కుదురుకుని.. తిరిగి కష్టాల్లోకి ఇంగ్లండ్
ABN , First Publish Date - 2022-07-18T00:07:36+05:30 IST
భారత్తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో ఇంగ్లండ్ కుదురుకున్నట్టు కనిపించి మళ్లీ ఒక్కసారిగా కష్టాల్లో
మాంచెస్టర్: భారత్తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో ఇంగ్లండ్ కుదురుకున్నట్టు కనిపించి మళ్లీ ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోయింది. 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ జోస్ బట్లర్, మొయిన్ అలీ జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి సమయోచితంగా ఆడుతూ క్రీజులో నిలదొక్కుకున్నారు. ఈ క్రమంలో 34 పరుగులు చేసిన మొయిన్ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన లివింగ్స్టోన్ కూడా నిదానంగా ఆడుతూ బట్లర్కు అండగా నిలిచాడు.
అయితే, హార్దిక్ పాండ్యా ఇంగ్లిష్ జట్టు మరోమారు కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాడు. 198 పరుగుల వద్ద లివింగ్స్టోన్ (27)ను అవుట్ చేసిన పాండ్యా.. అర్ధ సెంచరీ చేసి జోరుమీదున్న బట్లర్ (60)ను కూడా పెవిలియన్కు పంపడంతో జట్టు మరోమారు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం 38 ఓవర్లు ముగిశాయి. ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. డేవిడ్ విల్లీ, క్రెయిగ్ ఒవెర్టన్ క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ కోల్పోయిన ఏడు వికెట్లలో నాలుగు పాండ్యా ఖాతాలోకే చేరడం గమనార్హం.