రోహిత్ అందుకే టెస్టుల్లో రాణించలేకపోతున్నాడు: డేవిడ్ గ్రోవర్

ABN , First Publish Date - 2020-07-12T23:30:16+05:30 IST

టెస్టుల్లో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే 6 సెంచరీలు బాదేశాడు. అందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. రెండు వేలకు పైగా పరుగులు చేశాడు. అయితే ఇంత...

రోహిత్ అందుకే టెస్టుల్లో రాణించలేకపోతున్నాడు: డేవిడ్ గ్రోవర్

లండన్: టెస్టుల్లో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే 6 సెంచరీలు బాదేశాడు. అందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. రెండు వేలకు పైగా పరుగులు చేశాడు. అయితే ఇంత చక్కటి ఆటతీరు ప్రదర్శించినా మంచి టెస్ట్ ప్లేయర్ అనిపించుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. అతడే భారత ఓపెనింగ్ సంచలనం రోహిత్ శర్మ. వన్‌డే మ్యాచ్‌లలో అతడి కెరీర్‌తో పోల్చితే పైన పేర్కొన్న గణాంకాలన్నీ ఎందుకూ పనికిరావు. అదే అతడిని మంచి టెస్ట్ ప్లేయర్ స్థాయిని అందుకోవడానికి అడ్డుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గ్రోవర్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ లాంటి ఆటగాళ్లు ఎంతోమంది తనకు తెలుసని అన్నారు. వారంతా వన్‌డే, టీ20ల్లో అద్భుతంగా ఆడగలరని, కానీ టెస్టుల విషయానికి వచ్చే సరికి ఘోరంగా విఫలమవుతారని, అంతమాత్రాన వారు ప్రతిభావంతులు కాదనడానికి వీల్లేదని చెప్పుకొచ్చారు.


ఇంగ్లాండ్‌ జట్టులో కూడా జేసన్ రాయ్ అలాంటి ఆటగాడేనని చెప్పారు. ప్రపంచకప్ గెలుపులో జేసన్ పాత్ర ఎంతో ఉందని, ఓపెనర్‌గా వచ్చి సెంచరీలతో శుభారంభాలనిచ్చేవాడని, కానీ ఆ తరువాత జరిగిన యాషెస్ సిరీస్‌లో పేలవమైన ప్రదర్శన చేశాడని గ్రోవర్ గుర్తు చేశారు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ ఆటగాళ్ల ముందు ఎన్నో సవాళ్లను ఉంచుతుందని, అవి వన్‌డేల్లో కానీ, టీ20ల్లో కానీ ఆటగాడికి ఎదురుకావని గ్రోవర్ చెప్పారు.


ఈ కారణంగానే రోహిత్ శర్మ, జేసన్ రాయ్ లాంటి ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌లో రాణించలేకపోతున్నారని వివరించారు. అందువల్లే ఆటగాడి అసలైన ప్రతిభ టెస్టు క్రికెట్‌లోనే బయటపడుతుందని అంటారని, టెస్ట్ క్రికెట్‌ను క్రికెట్‌ పెద్దన్నగా చెప్పడానికి ఇదే కారణమని గ్రోవర్ తెలిపారు.

Updated Date - 2020-07-12T23:30:16+05:30 IST