డ్రోన్ కెమెరాలతో నిఘా
ABN , First Publish Date - 2020-04-03T07:15:29+05:30 IST
లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయడానికి పోలీసులు టెక్నాలజీని వాడుతున్నారు. ఇప్పటికే వేలాది మంది పోలీసులు రోడ్లపై రాత్రీ పగలూ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
బందోబస్తు పర్యవేక్షణకు కొత్త విధానం
పోలీసులకు మంత్రి కేటీఆర్ ప్రశంసలు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయడానికి పోలీసులు టెక్నాలజీని వాడుతున్నారు. ఇప్పటికే వేలాది మంది పోలీసులు రోడ్లపై రాత్రీ పగలూ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు బందోబస్తును సమీక్షిస్తున్నారు. అయితే అనేక ప్రాంతాల్లో కొందరు ఆకతాయిలు కావాలనే లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పలు కాలనీల్లో, పోలీస్ చెక్పోస్టులు లేనిచోట అలాంటి వారిని గుర్తించడం కష్టంగా మారుతోంది. ఈ సమస్యకు సైబరాబాద్ పోలీసులు సాంకేతికతతో చెక్ పెట్టారు. డ్రోన్ కెమెరాలను ఉపయోగించి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడెక్కడ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది, ఏ ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటోంది తదితర అంశాలను పర్యవేక్షిస్తున్నారు. రాత్రి, పగలు ఆయా ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీసి, దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం చేరవేస్తున్నారు. అప్రమత్తమవుతున్న పోలీసులు ఇష్టానుసారంగా రోడ్డెక్కిన వాహనదారులపై కేసులు నమోదు చేయడం, వాహనాలు సీజ్ చేయడం వంటివి చేస్తున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విటర్లో పోలీసులను అభినందించారు.