ఆదివాసీ ప్రాంతాలపై డ్రోన్‌ బాంబు దాడులు!

ABN , First Publish Date - 2021-04-22T07:54:28+05:30 IST

మావోయిస్టు పార్టీని దెబ్బ తీసేందుకు పోలీసులు డ్రోన్‌ సాయంతో బాంబు దాడులు చేశారని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శి వికల్ప్‌ ఆరోపించారు.

ఆదివాసీ ప్రాంతాలపై డ్రోన్‌ బాంబు దాడులు!

  • అడవి జంతువులు, పక్షులు, ప్రకృతి వినాశనం జరిగింది
  • అమెరికా, ఇజ్రాయిల్‌ నుంచి డ్రోన్లు కొన్న పోలీసులు
  • మావోయిస్టు దండకారణ్య కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ 
  • ఫోటోలు, వీడియో విడుదల


హైదరాబాద్‌/చర్ల/దుమ్ముగూడెం, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీని దెబ్బ తీసేందుకు పోలీసులు డ్రోన్‌ సాయంతో బాంబు దాడులు చేశారని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శి వికల్ప్‌ ఆరోపించారు. ఈ నెల 19వ తేదీ తెల్లవారు జాము 3 గంటలకు బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని బొత్తలంక, పాలగూడెం గ్రామాల్లో ఆదివాసీ ప్రాంతాలపై దాడులు చేశారంటూ ఫొటోలతో పాటు, పత్రికా ప్రకటనను బుధవారం విడుదల చేశారు. విక్పల్‌ పేరుతో ఉన్న ఆ లేఖలో మావోయిస్టు పార్టీని దెబ్బ తీసేందుకు పోలీసులు వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపించారు. జనావాసాలపై ఈ దాడులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పాల్పడ్డాయని ఆరోపించారు. ప్రజాఉద్యమాలు, ప్రజలపై డ్రోన్‌ దాడి చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. దీన్ని బ్లాక్‌ డేగా పరిగణిస్తున్నామన్నారు. సమాధార్‌, ప్రహార్‌లో భాగంగా ఈ నెల 3న అడవుల్లోకి వచ్చిన పోలీసులను తమ పీఎల్‌జీఏ చంపడాన్ని మోదీ, అమిత్‌ షా, ఇతర పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. అనంతరం ‘మావోయిస్టులు చావడమో, పారిపోవడమో’ అన్న కులదీ్‌పసింగ్‌ మాటల్లో అర్థమే డ్రోన్‌ దాడులని విమర్శించారు. ఆకాశం నుంచి దాడులు చేయడం దెబ్బతిన్న పోలీసులకు మనోదైర్యాన్ని ఇవ్వడమే అన్నారు. ఆకాశంలో డ్రోన్లు, హెలిక్రాప్టర్లు నిత్యం తిరగడాన్ని ప్రమాదంగా శంకించిన ప్రజలు, గెరిల్లాలు తప్పించుకున్నారని, కానీ అడవి జంతువులు, పక్షులకు ప్రమాదం జరిగిందని, ప్రకృతి వినాశనమైందన్నారు. 


అడవుల్లోని ఖనిజ సంపదను బడా కంపెనీలకు కట్టబెట్టేందుకే బాంబు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా వ్యాక్సిన్‌పై మోదీ ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా ప్రజలకు విశ్వాసం కుదరడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టులపై ఆకాశ దాడులు చేయడం టెర్రరిస్టు పథకంలో భాగమే అన్నారు. పోలీసుల క్యాంపులు, బలగాల తరలింపులు కూడా దాడుల్లో భాగమేనని ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా డ్రోన్ల ద్వారా చేస్తున్న దాడుల్లో అనేక మంది చనిపోతున్నారని, మోదీ ప్రభుత్వం కూడా అమెరికా, ఇజ్రాయిల్‌ నుంచి అత్యాధునిక డ్రోన్లను కొనుగోలు చేసి ఈ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆకాశం నుంచి చేస్తున్న దాడులు ప్రజలకు తీవ్ర ప్రాణ నష్టం చేస్తుందని, డ్రోన్‌ దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రహార్‌ ఆపరేషన్‌, క్యాపుల ఏర్పాటు ఆపాలని, స్థానిక యువకులతో ఏర్పాటు చేస్తున్న డీఆర్జీ, బస్తర్‌ బెటాలియన్‌ రిక్రూట్‌మెంట్‌ ఆపాలని, లోన్‌వర్రాట్‌ పథకాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు. ప్రజలపై చేస్తున్న దాడులకు నిరసనగా ఈ నెల 26న భారత్‌ బంద్‌కు పిలుపునిస్తున్నామని, ప్రహార్‌, డ్రోన్‌ దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆ లేఖలో కోరారు.


మావోయిస్టుల ఆరోపణల్లో నిజం లేదు: బస్తర్‌ ఐజీ

పోలీసులు డ్రోన్‌ బాంబులు విడిచారన్న మావోయిస్టుల ఆరోపణల్లో నిజం లేదని బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజన్‌ తెలిపారు. పోలీసులు దాడులు చేస్తారనే భయంతోనే మావోయిస్టులు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రతీ ఒక్కరి ప్రాణాలు కాపాడి, ప్రకృతిని ఆహ్లాదకరంగా ఉంచడమే పోలీసుల లక్ష్యమన్నారు. మావోయిస్టులు ఐఈడీ పెట్టడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బాధితుల్లో అడవి జంతువులు, పేదలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. వేలాది మందిని హతమార్చే మావోయిస్టులకు నిత్యం ప్రజల క్షేమం కోసం పనిచేసే పోలీసులపై ఆరోపణలు చేసే హక్కు లేదన్నారు. ఏఎస్ఐను కిడ్నాప్‌ చేసిన మావోయిస్టులుఛత్తీస్గఢ్‌లో మావోయిస్టులు ఎదురు కాల్పులతో పాటు, ఐఈడీ పేలుడు పదార్థాలతో పోలీసులను చంపేస్తున్నారు. బుధవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఒక ఏఎఎ్‌సఐను మావోయిస్టులు కిడ్నాప్‌ చేయగా.. ఐఈడీ పేలిన సంఘటనలో ఒక జవాను మృతి చెందారు. జగదల్‌పూర్‌ డీఆర్జీలో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ మురళి తాతిను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. సెలవుపై స్వగ్రామానికి వెళ్లిన మురళీని సాయంత్రం 4 గంటలకు తన ఇంటి నుంచి అపహరించారు. నారాయణపూర్‌ జిల్లాలో పోలీసు బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలడంతో ఒక జవాను మృతి చెందారు.

Updated Date - 2021-04-22T07:54:28+05:30 IST