‘‘కళ్లు మూసుకుని ప్రభుత్వాన్ని ఏలుతున్నారా... ఓ తల్లి ఉసురు తగులుతుంది’’

ABN , First Publish Date - 2020-05-29T21:48:43+05:30 IST

మంచిగా ఉన్న సుధాకర్‌ను పిచ్చాస్పత్రిలో చేర్పించారని సుధాకర్‌ తల్లి ...

‘‘కళ్లు మూసుకుని ప్రభుత్వాన్ని ఏలుతున్నారా... ఓ తల్లి ఉసురు తగులుతుంది’’

విశాఖ: మంచిగా ఉన్న సుధాకర్‌ను పిచ్చాస్పత్రిలో చేర్పించారని సుధాకర్‌ తల్లి కావేరి బాయి వాపోయారు. ఈ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదన్నారు. సుధాకర్‌కు ప్రాణహాని జరుగుతుందేమోనని భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సుధాకర్‌ను వెంటనే వేరే ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలు వచ్చేవరకు మందులు వాడొద్దన్నారు. సుధాకర్‌పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. సుధాకర్‌పై తెలుగుదేశం పార్టీ వ్యక్తి అని ముద్ర వేశారన్నారు. డాక్టర్లపై పార్టీల ముద్రలు వేయడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కళ్లు మూసుకుపోయాయన్నారు. సుధాకర్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్‌ రామిరెడ్డి.. 15 రోజుల్లో కేవలం రెండు సార్లు మాత్రమే ఆస్పత్రికి వచ్చారని తెలిపారు. రామిరెడ్డి ఇబ్బందులకు గురిచేస్తున్నారని సుధాకర్‌ చెప్పిన మాటల ఆడియో రికార్డ్‌ను సుధాకర్‌ తల్లి విడుదల చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడని, చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తున్నాడని.. సుధాకర్‌కు డాక్టర్‌ రామిరెడ్డి చికిత్స అందించడం లేదని ఆరోపించారు. ‘‘జీవితాంతం ఏ ప్రభుత్వం ఉండదు. ఉన్నంతలో మంచి చేసుకుంటూ పోవాలి. ఏ ప్రభుత్వంలోనూ ఇంత చండాలమైన ట్రీట్ మెంట్ జరగలేదు. కళ్లు మూసుకుని ప్రభుత్వాన్ని ఏలుతున్నారా... ఒక తల్లి ఉసురు తగులుతుంది. ఆయనకు కూడా తల్లి ఉంది. ఆ తల్లి పడే బాధ తెలుసుకోలేకపోతున్నాడు’’ అని తీవ్ర ఆవేదన చెందారు. 

Updated Date - 2020-05-29T21:48:43+05:30 IST