‘ఆరోగ్య’ సేవల్లోకి డాక్టర్‌ రెడ్డీస్‌

ABN , First Publish Date - 2021-07-28T07:05:22+05:30 IST

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఆన్‌లైన్‌ ఆరోగ్య సంరక్షణ సేవల్లోకి అడుగు పెడుతోంది.

‘ఆరోగ్య’ సేవల్లోకి డాక్టర్‌ రెడ్డీస్‌

  • తొలుత హైదరాబాద్‌, విశాఖపట్నంలలో
  • జూన్‌ త్రైమాసిక లాభం రూ.570 కోట్లు
  • మూడు నెలల కనిష్ఠానికి షేర్‌ 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఆన్‌లైన్‌ ఆరోగ్య సంరక్షణ సేవల్లోకి అడుగు పెడుతోంది. ఇందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ అనుబంధ సంస్థ శ్వాస్‌ వెల్‌నెస్‌, ఐసీఐసీఐ లొంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు చేతులు కలిపాయి. డిజిటల్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్‌ ద్వారా అవుట్‌ పేషెంట్‌ హెల్త్‌కేర్‌, వెల్‌నెస్‌ విభాగాల్లో డాక్టర్‌ కన్సల్టేషన్‌, పాథాలజీ లేబొరేటరీస్‌, డయాగ్నోస్టిక్‌ సేవలు, ఔషధాల విక్రయం, బీమా సేవలను అందిస్తుంది. ప్రయోగాత్మకంగా ఈ సేవలను హైదరాబాద్‌, విశాఖపట్నంలో ప్రారంభిస్తారు. అనంతరం మెట్రో, ప్రధాన నగరాలకు విస్తరిస్తారు. మల్టీ సర్వీస్‌ మొబైల్‌ యాప్‌ ప్లాట్‌ఫామ్‌.. డాక్టర్లు, లేబొరేటరీలు, డయాగ్నోస్టిక్స్‌, ఫార్మాసీ, బీమా సేవలను ఒక వేదిక పైకి తీసుకువస్తుందని డాక్టర్‌ రెడ్డీస్‌ సీఈఓ (బ్రాండెడ్‌ మార్కెట్లు, భారత్‌, వర్థమాన దేశాలు) ఎంవీ రమణ తెలిపారు. అవుట్‌ పేటెంట్లకు నగదు రహిత, ఇబ్బందులు లేని సేవలు అందుతాయి. దేశం లో ఈ తరహా సేవలు ప్రారంభించడం ఇదే మొదటిసారని అన్నారు. వినియోగదారులకు వెల్‌నెస్‌ పాలసీలు అందించడానికి ఐసీఐసీఐ లొంబార్డ్‌కు అవకాశం లభిస్తుంది.  


స్వల్పంగా తగ్గిన లాభం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన డాక్టర్‌ రెడ్డీస్‌ రూ.571 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.579 కోట్లతో పోలిస్తే ఒక శాతం తగ్గింది. సమీక్షా త్రైమాసికానికి ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.4,417.5 కోట్ల నుంచి రూ.4,919.4 కోట్లకు చేరింది. ఆదాయం పెరిగినప్పటికీ నికర లాభం, ఎబిటా మార్జిన్లు తగ్గడానికి అమెరికాలో కొన్ని ఉత్పత్తుల ధరలు తగ్గడం, బ్రాండ్లపై పెట్టుబడులు, వ్యయాలు పెరగడం కారణమని కారణమని కంపెనీ వెల్లడించింది. సమీక్ష త్రైమాసికానికి విక్రయాల్లో పెరుగుదల ఉందని.. కంపెనీ పెట్టిన పెట్టుబడుల కారణంగా రానున్న త్రైమాసికాల్లో ఎబిటా మార్జిన్‌ పెరుగుతుందని డాక్టర్‌ రెడ్డీస్‌ ఎండీ, సహ చైర్మన్‌ జీవీ ప్రసాద్‌ తెలిపారు. 


రెండు నెలల్లో ‘దేశీయ’ స్పుత్నిక్‌-వి

దేశీయంగా తయారు చేసిన స్పుత్నిక్‌-వి సెప్టెంబరు- అక్టోబరు నాటికి అందుబాటులోకి రానుంది. దేశీయంగా ఆరు కంపెనీలు వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే ప్రక్రియలో ఉన్నాయని డాక్టర్‌ రెడ్డీస్‌ సీఈఓ ఎంవీ రమణ తెలిపారు. సెప్టెంబరు-అక్టోబరు నాటికి స్థానిక కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగలదన్నారు. రష్యాలో కొవిడ్‌ కేసులు పెరగడం వల్ల వ్యాక్సిన్‌ రావడంలో జాప్యం జరుగుతోంది. ఆగస్టు చివరి నాటికి అక్కడ పరిస్థితులు సద్దుమణగవచ్చన్నారు. కాగా మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు ఇచ్చేందుకు వ్యాక్సిన్ల కోసం ఎదురు చూస్తున్నామని రమణ చెప్పారు. రెండో డోసు కోసం రష్యా నుంచి  27 లక్షల డోసుల వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్నామని రమణ తెలిపారు. స్పుత్నిక్‌-విపై రష్యాలో 12-18 ఏళ్ల వయసు పిల్లలపై క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు అక్టోబరు నాటికి పూర్తవుతాయి. ఆ డేటాను భారత్‌లో సమర్పించనున్నట్లు తెలిపారు. 


చట్టవిరుద్ధ చెల్లింపుల ఆరోపణలు..

కంపెనీ లాభం మార్కెట్‌ అంచనాలు చేరకపోవడంతో పాటు.. ఉక్రెయిన్‌, ఇతర దేశాల్లో చట్ట విరుద్ధంగా హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌కు కంపెనీ ముడుపులు చెల్లించిందని ఆరోపణలు వచ్చిన విషయం వెలుగు చూడడంతో మంగళవారం డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు 10 శాతానికి పైగా క్షీణించింది. ఎన్‌ఎ్‌సఈలో రూ.567.90 (10.49%) క్షీణించి రూ.4,843.35 వద్ద ముగిసింది. బీఎ్‌సఈలో కూడా 10.44 శాతం నష్టంతో రూ.4,844.35 వద్ద స్థిరపడింది. కంపెనీ లేదా కంపెనీ తరఫున హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌కు ఉక్రెయిన్‌, ఇతర దేశాల్లో కూడా చట్ట విరుద్ధంగా చెల్లింపులు జరిగాయని గుర్తుతేలియని వ్యక్తులు కంపెనీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తొమ్మిది నెలల క్రితం ఈ విషయం కంపెనీ దృష్టి వచ్చిందని డాక్టర్‌ రెడ్డీస్‌ సీఎ్‌ఫఓ పరాగ్‌ అగర్వాల్‌ తెలిపారు. కంపెనీ డైరెక్టర్ల బోర్డు కమిటీ ఆధ్వర్యంలో ఈ అంశాన్ని అమెరికాకు చెందిన న్యాయ సేవల కంపెనీతో విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. విచారణ ప్రస్తుతం జరుగుతోందన్నారు. అమెరికాకు చెందిన యాంటీ కరప్షన్‌ చట్టాలకు వ్యతిరేకంగా ఈ ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో కంపెనీ లిస్టయినందున అమెరికా న్యాయ శాఖకు, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ కమిషన్‌ (సెక్‌), సెబీకి ఈ విషయాన్ని ఈ నెల 6న కంపెనీ తెలిపింది. ఈ ఆరోపణలు రుజువైతే అమెరికాలో ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలు తీసుకునే వీలుంది. ఈ నేపథ్యంలో షేరు ధర భారీగా క్షీణించింది. మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 

Updated Date - 2021-07-28T07:05:22+05:30 IST