మా ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు

ABN , First Publish Date - 2021-02-26T08:45:05+05:30 IST

రాష్ట్రంలోని కారాగారాల్లో ఉన్న ఖైదీలకు పనికి ప్రోత్సాహకాలను పెంచుతూ జీవో జారీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది...

మా ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు

  • అధికారులు కోర్టుకు రావాల్సి ఉంటుంది
  • ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
  • పని ప్రోత్సాహకాల పెంపులో తాత్సారంపై ఆక్షేపణ
  • ఆగమేఘాలపై జీవో జారీ.. ధర్మాసనానికి అందజేత

అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కారాగారాల్లో ఉన్న ఖైదీలకు పనికి ప్రోత్సాహకాలను పెంచుతూ జీవో జారీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. సంబంధిత జీవోను ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు అందజేశారు. గురువారం విచారణ సందర్భంగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆగమేఘాలపై జీవో జారీ చేశారు. ఖైదీలకు న్యాయబద్ధమైన వేతనం చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ 2019లో న్యాయవాది తాండవ యేగేశ్‌ పిల్‌ దాఖలు చేశారు. ఖైదీల వేతనానికి సంబంధించి 1998లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం నైపుణ్యం, సగం నైపు ణ్యం ఉన్న, నైపుణ్యం లేనివారిగా విభజించి రూ.30, రూ.50, రూ.70 వేతనాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా... వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీవో ఇస్తుందని వారం గడువు ఇవ్వాలని కోరారు. ధర్మాసనం 2వారాల గడువు ఇస్తూ తదుపరి విచారణ నాటికి జీవోను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు రాగా, పరిపాలనా జాప్యం వల్ల ఉత్తర్వులు సమర్పించలేకపోతున్నామని, విచారణను సోమవారానికి వాయిదావేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఆ అభ్యర్థనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమర్‌తో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత విచారణలో వారం సమయం అడిగితే, 14 రోజుల గడువిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. పనికి ప్రోత్సాహకాల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చి, ఆ జీవోను సాయంత్రం 4గంటలకు కోర్టు ముందుంచాలని, విఫలమైతే బాధ్యులైన అధికారులు కోర్టుముందు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. న్యాయస్థానం ఆదేశాల పట్ల అధికారులకు గౌరవం ఉండాలని పేర్కొంది. కోర్టు ఆదేశాలను సీఎ్‌స, హోంశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. విచారణను సాయంత్రం 4గంటలకు వాయిదా వేసింది. సాయంత్రం విచారణ ప్రారంభమైన వెంటనే జీవోను ప్రభుత్వ న్యాయవాది కోర్టు ముందుంచారు. ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు ఇచ్చిన హామీలకు అధికారులు విలువ ఇచ్చేలా చూడాలని ఏజీకి కోర్టు సూచించింది. 

న్యాయస్థానం ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దని పేర్కొంది. సరైన స్ఫూర్తితో అమలు చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తామని ఏజీ  పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. విచారణను ధర్మాసనం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. 



ఖైదీల కష్టానికి రూ.200

జైలు జీవితం అనుభవిస్తోన్న ఖైదీల కష్టానికి ఇచ్చే పరిహారాన్ని ప్రభుత్వం పెంచింది. జైల్లో ఖైదీలు కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, టైలర్‌ తదితర పనులు చేస్తూ రోజుకు రూ.70 వేతనం పొందేవారు. గతేడాది జూలైలో జైళ్లశాఖ డీజీ నేతృత్వంలోని కమిటీ సిఫారసుల మేరకు స్కిల్డ్‌ పనిచేసే ఖైదీలకు రోజుకు రూ.200 ఇచ్చేందుకు సమ్మతించింది. సెమీ స్కిల్డ్‌ వర్కర్‌కు రూ.180, అన్‌ స్కిల్డ్‌ వర్కర్‌కు రూ.160 ఇచ్చేలా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 


Updated Date - 2021-02-26T08:45:05+05:30 IST