ఆర్థిక సాయం చేస్తారా? చేయరా?: డీకే అరుణ
ABN , First Publish Date - 2021-11-23T22:51:19+05:30 IST
సీఎం కేసీఆర్పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలు చేసే వరకు కేసీఆర్ను వేటాడతామని...
హైదరాబాద్: సీఎం కేసీఆర్పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలు చేసే వరకు కేసీఆర్ను వేటాడతామని ఆమె హెచ్చరించారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగాలేకనే కేసీఆర్ ఢిల్లీ వెళ్లాడని డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఢిల్లీపై కేసీఆర్ ఏ మాత్రం యుద్ధం చేశాడో గతంలో చూశామని ఎద్దేవా చేశారు. పంజాబ్ రైతులే రైతులా? అని ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ రైతులకు ఆర్థిక సాయం చేస్తారా? చేయరా? అని డీకే అరుణ నిలదీశారు.
‘‘అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం ఎప్పుడు చేస్తారో కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ చేసే ప్రతి పని వెనుక రాజకీయం ఉంటోంది. బీజేపీ కుట్రలు చేస్తే.. తెలంగాణకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చేది కాదు. దళితబంధు పథకం ఎప్పుడు అమలు చేస్తారో టీఆర్ఎస్ నేతలు చెప్పాలి. హుజురాబాద్ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మళ్ళించటానికే కేసీఆర్ యాసంగి పంట గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్కు ధర్నాచౌక్లో కూర్చునే పరిస్థితిని కేసీఆర్కు కల్పించాం. అసెంబ్లీ సాక్షిగా వరి వేయమని.. ఇప్పుడు వరి ఉరి అనటం కేసీఆర్ బాధ్యతారాహిత్యం. కావాల్సినంత బలం లేకనే స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ దూరంగా ఉంది. రైతు వేదికలు కాదు... అవి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు వేదికలు. కల్యాణ లక్ష్మీ చెక్ రావాలంటే లబ్ధిదారులకు 50 వేల ఖర్చు అవుతుంది.’’ అని డీకే అరుణ విమర్శించారు.