ఆ భూమిని ముట్టుకుంటే ఉసురు కొట్టుకుపోతారు: డీకే అరుణ

ABN , First Publish Date - 2021-12-25T00:55:22+05:30 IST

సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుపై 👆🏻బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ భూమిని ముట్టుకుంటే ఉసురు కొట్టుకుపోతారు: డీకే అరుణ

హైదరాబాద్: సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అరుణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పేదల ఇళ్ల కోసం గద్వాలలో  సేకరించిన భూమిని ముట్టుకుంటే ఉసురు కొట్టుకుపోతారు. గద్వాల అభివృద్ధిపై మాట్లాడే అర్హత కేసీఆర్,  హరీష్‌రావుకు లేదు. తన శవంపై నర్సింగ్ కాలేజ్, ఆస్పత్రి నిర్మాణం చేసుకోవాలి. ఇళ్ల కోసం ఇచ్చిన భూములను సేకరించటానికి ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలి. హరీష్ గద్వాల పర్యటనలో బీజేపీ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తున్నా. బీజేపీ కార్యకర్త చెయ్యి విరగొట్టిన రూరల్ ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. కేసీఆర్, హరీష్‌రావును లాఠీలతో కొడితే ఆ బాధేంటో తెలుస్తోంది. అవగాహన లేకుండా మాట్లాడే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. 


నాపై వ్యక్తిగత కక్షతో పేదల ఇళ్ల కోసం సేకరించిన భూములు గుంజుకోవటం అన్యాయం. మంత్రి హరీష్‌రావు దొంగతనంగా గద్వాల వచ్చి నర్సింగ్ కాలేజ్‌కు ఫౌండేషన్ వేశాడు. ప్రభుత్వ భవ‌నాల కోసం గజం  భూమిని కూడా సేకరించలేని స్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కొంతమంది పోలీసులు మానవత్వాన్ని కోల్పోతున్నారు. గద్వాలలో 5వేల మందికి ఇళ్లు ఇస్తామని తాను హామీ ఇవ్వలేదని లక్ష్మీనరసింహాస్వామిపై కేసీఆర్ ప్రమాణం చేయగలరా?. డబుల్ బెడ్ రూం ఇళ్లు అడిగినందుకు దాడులు చేయటం హేయమైన చర్య. సోషల్ వెల్ఫేర్ అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరి వ్యవహరిస్తున్నారు.పేదల ఇళ్ల కోసం 2012లో 78 ఎకరాల పట్టా భూమిని సేకరించి ప్రభుత్వానికిచ్చాం ’’ అని డీకే అరుణ టీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-12-25T00:55:22+05:30 IST