TS News: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఖాయం: డీకే అరుణ
ABN , First Publish Date - 2022-08-09T00:25:21+05:30 IST
త్వరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
తాండూరు: త్వరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ (BJP) లో అనేక మంది నాయకులు చేరుతున్నారని, ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. గెలిచే గుర్రాలకే పార్టీ టికెట్ ఇస్తుందన్నామని తెలిపారు. హెలీకాప్టర్లో తిరిగే మంత్రి కేటీఆర్ (KTR) కార్లలో తిరిగితే రోడ్ల దుస్థితి తెలుస్తుందని అన్నారు. ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకొనే సీఎం కేసీఆర్ (CM KCR) కొత్త పింఛన్లు ఇస్తామని పేర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికలు వచ్చినపుడే కేసీఆర్కు పింఛన్లు, దళితబంధులు గుర్తుకు వస్తాయన్నారు. వర్షాలతో ప్రజాగోస, బీజేపీ భరోసా యాత్రకు ఆటంకాలు వస్తున్నా మున్ముందు ఈ యాత్రను కొనసాగిస్తామని అరుణ ప్రకటించారు.