బులెటిన్లలో భిన్నమైన డేటా!
ABN , First Publish Date - 2020-04-04T10:43:48+05:30 IST
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వాటి సంఖ్యను వెల్లడించడంలో ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ పరస్పరం భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.
సీఎంవో, ఆరోగ్యశాఖది చెరోదారి
పొంతన కుదరని కేసుల లెక్కలు
హైదరాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వాటి సంఖ్యను వెల్లడించడంలో ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ పరస్పరం భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. మార్చి 30న రాష్ట్రంలో కరోనాతో ఒకరు మరణించారని, కేవలం ఆరు కేసులే నమోదయ్యాయని, మొత్తం రెండు మరణాలు సంభవించాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే.. సీఎం కార్యాలయం కరోనాతో ఆరుగురు మరణించారని వెల్లడించింది. ఏప్రిల్ 1న కూడా ఇలాంటి ఘటనే పునరావృతమైంది. కరోనాతో ముగ్గురు చనిపోయారని, 30 మందికి పాజిటివ్ వచ్చినట్లు సీఎంవో ప్రకటించింది.అంతకు ముందు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలో కరోనాతో ఆ రోజు కేవలం ఒకరే మృతి చెందారని, 12 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. మొత్తం మరణాలు ఐదుకు చేరుకున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి మార్చి 30 వరకు కరోనాతో ఆరుగురు చనిపోయినట్లు స్వయంగా సీఎంవో ప్రకటిస్తే.. రెండు రోజుల తరువాత వైద్య ఆరోగ్యశాఖ ఐదుగురు చనిపోయినట్లు ప్రకటించింది. కానీ.. ఆ రోజుకల్లా మొత్తం మరణాల సంఖ్య 9కు చేరుకున్నట్లు సీఎంవో ఇచ్చిన ప్రకటనను బట్టి అర్థం అవుతోంది. ఇక రోజువారీగా నమోదు అవుతోన్న కేసుల సంఖ్యను వెల్లడించడంలోనూ వైద్య ఆరోగ్యశాఖ తీవ్రమైన జాప్యం చేస్తోంది. ఏపీలో రోజుకు మూడు సార్లు హెల్త్ బులెటెన్ విడుదల చేస్తుంటే తెలంగాణలో మాత్రం అర్ధరాత్రి సమయంలో విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ ఏ జిల్లాలో ఎన్ని కేసులు? అనే విషయాలను బహిర్గతం చేయడం లేదు.