చెన్నై చేరుకున్న ధోనీ
ABN , First Publish Date - 2021-03-05T04:58:21+05:30 IST
టీమిండియా మాజీ కెప్టెన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెన్నై చేరుకున్నాడు. తనకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ..
చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెన్నై చేరుకున్నాడు. తనకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోటల్కు బుధవారం సాయంత్రం చేరుకున్నాడు. చెన్నై సూపర్కింగ్స్ ఫ్రాంచైజీ ఇప్పటికే తమ జట్టు ఆటగాళ్లకు సకల సౌకర్యాలతో ప్రత్యేకంగా ఓ శిబిరం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెన్నైకి చేరుకున్నాడు. దీంతో హోటల్ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. హోటల్కు చేరుకోగానే ధోనీకి హోటల్, ఫ్రాంచైజీ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి లోనికి ఆహ్వానించాడు.
దీనికి సంబంధించిన వీడియోను చెన్నై ఫ్రాంచైజీ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘తలైవా వచ్చేశాడు.. ఇక సింహం నడక మొదలైంది.. విజిల్ పొడు’ అంటూ ఆ ట్వీట్లో రాసుకొచ్చింది. అంతకుముందే అంబటి రాయుడు శిబిరానికి చేరుకోగా.. అప్పుడు కూడా చెన్నై ఇలానే ఓ ఫన్నీ కామెంట్ ట్వీట్ చేసింది. ‘మనవాడు బాహుబలి మొదట వచ్చాడు!!!’ అంటూ రాయుడు చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఇంగ్లాండ్తో టెస్టు సిరీసు పూర్తవ్వగానే చతేశ్వర్ పుజారా కూడా చెన్నై బయలుదేరనున్నాడు.
శిక్షణ శిబిరం మార్చి 9 నుంచి ప్రారంభం కానున్నట్లు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో శిబిరం నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఆటగాళ్లు మొదట 5 రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారని, ఆ సమయంలో వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తామని, వరుసగా మూడుసార్లు నెగెటివ్ వచ్చిన వారినే శిబిరంలో ఆడేందుకు అనుమతిస్తామని వెల్లడించారు.