వరుస ఓటములతో డీలా పడిన చెన్నైకి మరో షాక్
ABN , First Publish Date - 2022-04-13T01:00:42+05:30 IST
వరుస ఓటుములతో డీలా పడిన చెన్నై సూపర్ కింగ్స్కు ఇప్పుడు మరో దెబ్బ తగిలింది.
ముంబై: వరుస ఓటములతో డీలా పడిన చెన్నై సూపర్ కింగ్స్కు ఇప్పుడు మరో దెబ్బ తగిలింది. వెన్ను నొప్పి కారణంగా తొలి నాలుగు మ్యాచ్లకు దూరమైన దీపక్ చాహర్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ పర్యవేక్షణలో ఉన్నాడు.
ఐపీఎల్ మెగా వేలంలో రూ. 14 కోట్లు వెచ్చించి దీపక్ చాహర్ను చెన్నై కొనుగోలుచేసింది. విండీస్తో జరిగిన టీ20 సిరీస్లో గాయపడిన దీపక్ చాహర్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. గాయం నుంచి కోలుకుని ఈ సీజన్లో అతడు అందుబాటులోకి వస్తాడా? లేదా? అన్న విషయంలో స్పష్టత లేదు.
ఈ సీజన్లో పేలవ ప్రదర్శనతో తడబడుతున్న చెన్నై ఇప్పటి వరకు బోణీ కొట్టలేకపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పదో స్థానంలో ఉంది. చెన్నై దుస్థితికి నాయకత్వ మార్పే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ మాత్రం అలాంటిదేమీ లేదని, జట్టు నుంచి అతడికి పూర్తి మద్దతు ఉందని చెప్పాడు.