జూన్ 10 వరకు ఆగాల్సిందే!
ABN , First Publish Date - 2020-05-29T09:16:01+05:30 IST
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగుతుందా? లేదా? అనే విషయంలో స్పష్టత వచ్చేందుకు మరో పక్షం రోజులు ఆగాల్సిందే. వాస్తవానికి గురువారం టెలీ ...
టీ20 ప్రపంచక్పపై నిర్ణయం వాయిదా
మీడియాకు లీకులపై సభ్యుల అభ్యంతరం
ఎటూ తేల్చని ఐసీసీ బోర్డు మీటింగ్
దుబాయ్: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగుతుందా? లేదా? అనే విషయంలో స్పష్టత వచ్చేందుకు మరో పక్షం రోజులు ఆగాల్సిందే. వాస్తవానికి గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బోర్డు సమావేశంలో ఈ మెగా టోర్నీపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా దీంతో పాటు అజెండాలో చర్చించాల్సిన మిగతా అంశాలపై కూడా జూన్ 10 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని బోర్డు భావించింది. షెడ్యూల్లో భాగంగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగాలి. కానీ అలా కాకుండా అదే విండోలో ఐపీఎల్ జరుగుతుందని, దీనికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా సుముఖంగానే ఉందంటూ వార్తలు వినిపించాయి. ఈ ఊహాగానాలపైనే సమావేశంలో చాలా మంది బోర్డు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అత్యున్నత బోర్డు సమావేశంలో జరిగే చర్చల విశ్వసనీయత, పవిత్రతపై అందరికీ నమ్మకం కుదిరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా తుది నిర్ణయం ప్రకటించకుండానే ఇలా విషయాలు బయటికి పొక్కడం సరికాదని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఐసీసీ ఎథిక్స్ అధికారి ఆధ్వర్యంలో విచారణ జరపాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ కమిటీ ఇచ్చే నివేదికను వచ్చే నెల 10న జరిగే తదుపరి సమావేశంలో ఐసీసీ సీఈఓ బోర్డు ముందుంచుతారు. కాగా.. కరోనా నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ఏడాది టీ20 వరల్డ్క్పను తాము నిర్వహించలేమని ఐసీసీకి సీఏ లేఖ రాసినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. దీనికి బదులుగా వచ్చే ఏడాది టోర్నీని తమ దగ్గరే జరపాలని సీఏ కోరినట్టు సమాచారం.
మూడు స్లాట్స్పై ఆలోచన..
పొట్టి ప్రపంచక్పను ఎప్పుడు జరపాలనే దిశగా ఐసీసీ మూడు అత్యవసర విండోలపై దృష్టి సారించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి, అక్టోబరుతో పాటు 2022 అక్టోబరు కూడా ఇందులో ఉంది. అయితే ఎలాంటి చర్చ లేకుండానే నిర్ణయాన్ని వచ్చే సమావేశానికి వాయిదా వేశారు. ‘కొవిడ్-19 వైరస్ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందుల నేపథఽ్యంలో వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించే విధంగా వాటాదారులతో చర్చలు కొనసాగాలని బోర్డు సభ్యులు ఐసీసీ మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశారు’ అని ఐసీసీ ప్రకటించింది.