దలాల్ స్ట్రీట్... బైడెన్...
ABN , First Publish Date - 2021-01-21T19:59:47+05:30 IST
ఇప్పటికే సరికొత్త శిఖరాలకు చేరిన మార్కెట్ (ఈ రోజు) గురువారం కూడా అదే హవాను కొనసాగించింది. ఆరంభంలోనే సరికొత్త గరిష్టాలను నమోదు చేసిన కీలక సూచీలు రెండూ కూడా... సరికొత్త చరిత్రను సృష్టించాయి.
ముంబై : ఇప్పటికే సరికొత్త శిఖరాలకు చేరిన మార్కెట్ (ఈ రోజు) గురువారం కూడా అదే హవాను కొనసాగించింది. ఆరంభంలోనే సరికొత్త గరిష్టాలను నమోదు చేసిన కీలక సూచీలు రెండూ కూడా... సరికొత్త చరిత్రను సృష్టించాయి. ప్రత్యేకించి సెన్సెక్స్ తొలిసారి 50 వేల రికార్డు స్థాయిని, నిఫ్టీ 14,700 మార్క్లను దాటేసి ఆల్ టైం రికార్డు స్థాయిని సృష్టించాయి. మెటల్ మినహా, దాదాపు అన్ని రంగాల షేర్లు కూడా కొనుగోళ్లతో కళ కళలాడుతున్నాయి. ప్రస్తుతం 297 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ 50,078 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 14,728 వద్ద కొనసాగుతున్నాయి. గతేడాది మార్చి నుంచి పది నెలల్లో రెట్టింపైంది.
ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఆస్తులను కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 24,713 కోట్ల విలువైన ఒప్పందాన్ని మార్కెట్ రెగ్యులేటర్ ఆమోదించిన తరువాత రిలయన్స్భారీగా లాభపడుతోంది. దలాల్ స్ట్రీట్కు ఇది మంచి ఊతాన్నిచ్చింది.
ఇదిలా ఉండగా... అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం తరువాత కోవిడ్-19 నష్టాలను భర్తీ చేసుకునేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు. దీంతో ఇతర ఆసియా మార్కెట్లు కూడా గురువారం కొత్త రికార్డు స్థాయికి చేరుకోవడం గమనార్హం.