Daggubati Venkateswara Rao: ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీకి దగ్గరవుతుండటంతో..
ABN , First Publish Date - 2022-09-19T03:20:00+05:30 IST
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు ఇవ్వబోతున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని..
ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు ఇవ్వబోతున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకొని ప్రత్యేక గుర్తింపు పొందిన విషయం విదితమే. అందులో చీరాల నుంచి గెలుపొందిన కరణం బలరాం వైసీపీకి మద్దతుగా మారిపోవటంతో టీడీపీకి అద్దంకి, పర్చూరు, కొండపి ఎమ్మెల్యేలు రవికుమార్, సాంబశివరావు, స్వామిలు ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ ముగ్గురూ ప్రతిపక్ష పాత్ర పోషించటంలో సఫలీకృతులయ్యారు.
అయితే కొంతకాలంగా ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీకి దగ్గరవుతుండటంతో ఆయన కుమారుడిని పర్చూరు లేక చీరాల నుంచి బరిలో దించుతారనే ప్రచారం ప్రారంభమైంది. ఇటు దామచర్ల కుటుంబంలో వచ్చిన కొద్దిపాటి మనస్పర్థలతో కొండపి ఎమ్మెల్యే స్వామికి వ్యతిరేకంగా ఆ కుటుంబంలోని ఒకరిద్దరు ప్రయత్నిస్తారనే ప్రచారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ తిరిగి టికెట్లు ఇవ్వబోతున్నట్లు గురువారం జరిగిన సమావేశంలో బహిరంగంగానే చెప్పేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలకు భవిష్యత్తులో పోటీ చేసే అంశంపై పూర్తి స్పష్టత రాగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు మాత్రం అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.