ఎల్ఐసీ డబ్బులు వచ్చాయంటూ ఫోన్.. నిజమేనని నమ్మి ఓటీపీ చెప్తే..
ABN , First Publish Date - 2020-06-25T20:20:11+05:30 IST
సైబర్ నేరగాళ్లు గిఫ్ట్లు, డబ్బు ఆశ చూపి డబ్బు కొల్ల గొడుతున్నారు. మక్కినవారిగూడెంలో వెలుగుచూసిన ఘటన వివరాలు ఎస్ఐ కె.రామకృష్ణ తెలిపారు. గ్రామానికి చెందిన పరసా మురళి
టి.నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): సైబర్ నేరగాళ్లు గిఫ్ట్లు, డబ్బు ఆశ చూపి డబ్బు కొల్ల గొడుతున్నారు. మక్కినవారిగూడెంలో వెలుగుచూసిన ఘటన వివరాలు ఎస్ఐ కె.రామకృష్ణ తెలిపారు. గ్రామానికి చెందిన పరసా మురళి కలప వ్యాపారం చేస్తుం టాడు. ఈ నెల 19న కలప కొనుగోలుకు గట్టుగూడెం వెళ్లాడు. అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఎల్ఐసీ డబ్బులు రూ.20 వేలు వచ్చాయంటూ బ్యాంక్ ఖాతా నెంబర్ అడిగాడు. మురళి తన భార్య ప్రమీల ఖాతా నెంబర్ చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత అదేవ్యక్తి తిరిగి ఫోన్ చేసి ఓటీపీ నెంబర్ అడిగి ఆమె ఖాతా నుంచి రూ.18,800 డ్రా చేశాడు. దీంతో మోసపోయినట్టు గుర్తించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
బెదిరించి సొమ్ము కాజేసిన ఇద్దరిపై కేసు
బెదిరించి సొమ్ము కాజేసిన ఘటనలో ఇద్దరిపై జంగారెడ్డిగూడెం పోలీస్టేషన్లో కేసు నమోదైంది. పట్టణంలోని మార్కండేయ పురంలో పేదలకు ఇళ్ల స్థలాలకు భూసేకరణ చేశారు. బాలపర్తి దుర్గారావు, తోట రామారావుకు చెందిన ఎనిమిది ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఒక్కొ ఎకరం రూ.44,53,075కు అప్పగించారు. ఈ సొమ్ములో శేఖర్, సంపత్ రాజు అనే వ్యక్తులు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, వారి బెదిరింపులకు భయపడి రూ.5లక్షలు చొప్పున ఇచ్చామని దుర్గారావు, రామారావు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ గంగాధర్ తెలిపారు.