కరెంట్ బిల్లులు @ రూ.1094 కోట్లు
ABN , First Publish Date - 2022-05-15T09:12:11+05:30 IST
దక్షిణ డిస్కమ్(ఎస్పీడీసీఎల్)లో ఏప్రిల్ నెల వినియోగానికి సంబంధించి రూ.1094.39 కోట్ల మొత్తానికి బిల్లులు జారీ చేశారు.
దక్షిణ డిస్కమ్లో ఏప్రిల్ నెల గృహ, గృహేతర బిల్లుల జారీ
హైదరాబాద్, మే 14(ఆంధ్రజ్యోతి): దక్షిణ డిస్కమ్(ఎస్పీడీసీఎల్)లో ఏప్రిల్ నెల వినియోగానికి సంబంధించి రూ.1094.39 కోట్ల మొత్తానికి బిల్లులు జారీ చేశారు. గృహ, గృహేతర వినియోగదారులకు జారీ అయిన బిల్లులను పరిశీలిస్తే.. అవి భారీగా ఉన్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కరెంట్ చార్జీలు పెరిగిన విషయం విదితమే. ఏప్రిల్లో గృహ విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఇక ఫిబ్రవరి నెల వినియోగానికి సంబంధించి మార్చిలో రూ.627.48 కోట్ల మొత్తానికి బిల్లులు జారీ కాగా.. మార్చి వినియోగానికి సంబంధించి ఏప్రిల్లో జారీ అయిన బిల్లులు రూ.894.53 కోట్లుగా ఉన్నాయి. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలలో భారీగా గృహ వినియోగం ఉంటుంది. అయితే ఈ దఫా కరెంట్ బిల్లులే కాదు.. ఎండలూ పెరిగాయి. దీంతో వినియోగానికి కరెంట్ చార్జీల పెరుగుదల కూడా కలవడంతో ఏప్రిల్ నెల వినియోగానికి భారీగా బిల్లులు వచ్చాయి. చార్జీల భారంతో పెరిగిన బిల్లులు ఏ మేర ఉంటాయనే దానిపై జూన్ నెల వినియోగంతోనే (జూలైలో జారీ అయ్యే బిల్లులు) స్పష్టత రానుంది. కరెంట్ చార్జీలను లోటెన్షన్(ఎల్టీ) కేటగిరిలో గృహ వినియోగదారులకు యూనిట్కు 0.50 పైసలు, అదే గృహేతర, హెచ్టీ వినియోగదారులకు యూనిట్కు రూపాయి చొప్పున చార్జీలు పెరిగాయి.