పరీక్ష చేయించుకోకుండా గోవాలోకి కోవిడ్ రోగి.. దర్యాప్తునకు సీఎం ఆదేశం

ABN , First Publish Date - 2020-06-06T01:19:38+05:30 IST

ముంబై నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలు కోవిడ్-19 పరీక్ష చేయించుకోకుండా తప్పించుకోవడంపై ముఖ్యమంత్రి

పరీక్ష చేయించుకోకుండా గోవాలోకి కోవిడ్ రోగి.. దర్యాప్తునకు సీఎం ఆదేశం

పనాజీ: ముంబై నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలు కోవిడ్-19 పరీక్ష చేయించుకోకుండా తప్పించుకోవడంపై ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు సీఎం తెలిపారు. ఉత్తర గోవాలోని కలాన్‌గుట్‌కు చెందిన ఓ వృద్ధురాలు ముంబై నుంచి వస్తూ కోవిడ్-19 పరీక్ష నుంచి తప్పించుకుంది. గురువారం ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో పరీక్ష నిర్వహించగా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆమె పరీక్షను దాటవేసినట్టు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.  


గోవాలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరు కోవిడ్-19 పరీక్ష చేయించుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అలాగే, రాష్ట్ర సరిహద్దులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయంలో స్వాబ్ శాంపిళ్లను సేకరిస్తోంది. ‘‘ఆమె కోవిడ్ పరీక్ష చేయించుకోకుండానే రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. ఆమెకు కోవిడ్ నిర్ధారణ కాగానే డెడికేటెడ్ కోవిడ్-19 ఆసుపత్రిలో చేర్చాం’’ అని సీఎం తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు చెప్పారు. కాగా, గురువారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 166 కేసులు నమోదు కాగా, 57 మంది కోలుకున్నారు. ఇంకా 109 మంది చికిత్స పొందుతున్నారు.  

Updated Date - 2020-06-06T01:19:38+05:30 IST