అంగరంగ వైభవంగా NRI పెళ్లికి డెకరేషన్.. మధ్యలో షాకిచ్చిన కోర్టు..

ABN , First Publish Date - 2021-09-11T04:55:40+05:30 IST

పెళ్లి చేసుకోవడం గొప్ప విషయమే. దానికోసం వైభవంగా ఏర్పాట్లు చేసుకోవడం సర్వ సాధారణమే. కానీ ఏదీ శృతి మించకూడదు. ఒకవేళ అదే జరిగితే లేనిపోని సమస్యలు ..

అంగరంగ వైభవంగా NRI పెళ్లికి డెకరేషన్.. మధ్యలో షాకిచ్చిన కోర్టు..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి చేసుకోవడం గొప్ప విషయమే. దానికోసం వైభవంగా ఏర్పాట్లు చేసుకోవడం సర్వ సాధారణమే. కానీ ఏదీ శృతి మించకూడదు. ఒకవేళ అదే జరిగితే లేనిపోని సమస్యలు వచ్చిపడతాయి. కేరళకు చెందిన ఓ ఎన్నారై విషయంలో అదే జరిగింది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఓ ఎన్నారై వ్యాపారవేత్త రవి పిల్లై తన తనయుడు వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం ప్రముఖ గురువయ్యూర్ శ్రీ కృష్ణ ఆలయంలో అన్ని ఏర్పాట్లూ చేయించాడు. వివాహ వేదికను దగ్గరుండి మరీ అత్యద్భుతంగా తీర్చిదిద్దించాడు. 


ఇక్కడే అతడికి అనుకోని షాక్ తగిలింది. కేరళ హై కోర్టు ఈ డెకరేషన్‌ను తప్పుబట్టింది. వెంటనే దీనిపై సమాధానం ఇవ్వాలని ఆలయ ధర్మాధికారికి, రవి పిళ్లైకి నోటీసులు పంపించింది. వేదిక డెకరేషన్ కోసం పూలతో పాటు భారీ కొమ్మలు, కర్టెన్లు వినియోగించడంపై ప్రశ్నించింది.


దీనికి సమాధానమిచ్చిన దేవస్థానం అధికారులు.. పూల డెకరేషన్‌కు మాత్రమే తాము అనుమతులిచ్చామని, కొమ్మలు, కర్టెన్లు వినియోగించుకునేందుకు అనుమతులు జారీ చేయలేదని వివరించారు. అయితే గురువారం వివాహ వేడుక జరిగడానికి ముందు రవి పిళ్లై స్వామివారికి భారీ కానుక సమర్పించాడు. బుధవారం సకుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి దాదాపు 725 గ్రాముల రత్నాలు పొదిగిన బంగాలు కిరీటాన్ని స్వామివారికి కానుకగా ఇవ్వడం గమనార్హం. 


ఇంతటి కానుక ఇవ్వడం వల్లనే వివాహ డెకరేషన్‌పై దేవస్థానం అధికారులు మాట్లాడలేదనే ఆరోపణలూ ఉన్నాయి. కాగా.. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో కేవలం వివాహాలకు కేవలం 12 మంది మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి ఉంది. ప్రతి రోజూ దాదాపు 110 వివాహాలు ఈ ఆలయంలో జరుగుతున్నాయి.

Updated Date - 2021-09-11T04:55:40+05:30 IST