కౌంటర్‌ దాఖలు చేయండి: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2021-10-26T08:33:37+05:30 IST

అడ్వొకేట్‌ జనరల్‌ న్యాయ సలహా మేరకే కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సుంకర పావనిపై అవిశ్వాస

కౌంటర్‌ దాఖలు చేయండి: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అమరావతి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): అడ్వొకేట్‌ జనరల్‌ న్యాయ సలహా మేరకే కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మానం వివరాలను ప్రభుత్వానికి పంపినట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ హైకోర్టుకు వివరించారు. ఓ కార్పొరేటర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి స్పందిస్తూ... ఎలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు కార్పొరేషన్‌ మేయర్‌గా మరో వ్యక్తిని ఎన్నుకున్నారని తెలిపారు. ఆ వివరాలు నమోదుచేసిన కోర్టు.. ఈ వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేష్‌ సోమవారం ఆదేశాలిచ్చారు. తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని సవాల్‌ చేస్తూ పావని పిటిషన్‌ దాఖలు చేయగా సమావేశ ఫలితం తమ తుదితీర్పుకి లోబడి ఉంటుందని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అవిశ్వాస తీర్మానం ఫలితాన్ని కలెక్టర్‌ ప్రభుత్వానికి పంపించడంతో మేయర్‌గా పావనిని తొలగిస్తూ ప్రభుత్వం జీవోతో పాటు గెజిట్‌ జారీ చేసింది. వాటిని సవాల్‌ చేస్తూ ఆమె తాజాగా హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలు చేశారు. దానిని విచారించిన న్యాయస్థానం ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో కలెక్టర్‌ సోమవారం కోర్టు ముందు హాజరయ్యారు.

Updated Date - 2021-10-26T08:33:37+05:30 IST