బీఎస్-4 వాహన విక్రయాలకు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2020-03-28T06:24:52+05:30 IST
కరోనా వైరస్ సంక్షోభ నేపథ్యంలో దేశంలో భారత్ స్టేజ్-4 (బీఎస్-4) వాహనాల అమ్మకానికి సంబంధించి సుప్రీంకోర్టు డెడ్లైన్ను ఏప్రిల్ 24 వరకు పొడిగించింది. ఈ వాహనాల విక్రయాలను...
24వ తేదీ వరకూ వాహనాలు అమ్ముకోవచ్చు
ఆటో డీలర్లకు సుప్రీం కోర్టు అనుమతి
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ సంక్షోభ నేపథ్యంలో దేశంలో భారత్ స్టేజ్-4 (బీఎస్-4) వాహనాల అమ్మకానికి సంబంధించి సుప్రీంకోర్టు డెడ్లైన్ను ఏప్రిల్ 24 వరకు పొడిగించింది. ఈ వాహనాల విక్రయాలను మార్చి 31 వరకు పూర్తి చేయాలని సుప్రీం గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా), ఆటోమొబైల్ ఉత్తిదారుల సంఘం.. సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో కోర్టు సానుకూలంగా స్పందించింది. కరోనా వైరస్ మూలంగా లాక్డౌన్ కొనసాగుతున్నందువల్ల ఏప్రిల్ 14న లాక్డౌన్ పూర్తయిన తర్వాత మరో పది రోజుల వరకు బీఎస్-4 వాహనాల అమ్మకం కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాగించిన విచారణ తర్పాత స్పష్టం చేశారు. లాక్డౌన్ మూలంగా డీలర్లు తమ స్టాకును అమ్మడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ షోరూమ్లకు కొనుగోలుదారులు రావడంలేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. బీఎస్-4 ప్రమాణాలతో కూడిన 15 వేల ప్యాసింజర్ కార్లు, 12 వేల వాణి జ్య వాహనాలు, ఏడు లక్షల టూ వీలర్లు ప్రస్తుతం పేరుకుపోయాయని తెలిపారు. అయితే దేశ పర్యావరణ పరిస్థితిని కూడా పిటిషన్ దారులు అర్థం చేసుకోవాలని, కరోనా వైర్సను ఉపయోగించుకోవాలని చూడకూడదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అమ్ముడుపోయిన వాహనాలు లాక్డౌన్ మూలంగా రిజిస్టర్ కాకపోతే లాక్డౌన్ తర్వాత రిజిస్టర్ చేసుకోవచ్చని వారు చెప్పారు.