కరోనా వచ్చి.. పోయింది.. కోటి మందికి!
ABN , First Publish Date - 2020-09-11T08:46:21+05:30 IST
ఆంధ్రప్రదేశ్ జనాభా సుమారు 5 కోట్లు! అధికారికంగా నమోదైన కరోనా కేసులు ఐదు లక్షలకు పైనే! కానీ... మొత్తం జనాభాలో 19.7 శాతం మందికి, అంటే
- తొమ్మిది జిల్లాల్లో ‘సీరో’ సర్వే
- 19.7 శాతం మందిలో యాంటీబాడీస్
- లక్షణాలు కనిపించకుండానే కరోనా వైరస్
- అత్యధికంగా విజయనగరంలో 30.6 శాతం
- ఆ తర్వాత కర్నూలులో 28.1 శాతం
- ఆ రెండు జిల్లాల్లో కేసులు తగ్గే అవకాశం
- ‘పశ్చిమ’లో 12.3 శాతం మందిలోనే సీరో
- రెండో విడత సర్వే ఫలితాలు విడుదల
విజయవాడ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ జనాభా సుమారు 5 కోట్లు! అధికారికంగా నమోదైన కరోనా కేసులు ఐదు లక్షలకు పైనే! కానీ... మొత్తం జనాభాలో 19.7 శాతం మందికి, అంటే దాదాపు కోటి మందికి కరోనా వైరస్ సోకి వెళ్లిపోయిందని సీరో సర్వేలో తేలింది. రక్తంలోని సీరంలో ఉన్న యాంటీ బాడీస్ ఆధారంగా కరోనా వైరస్ సోకిందా లేదా అనే విషయాన్ని గుర్తించవచ్చు. వైరస్ వ్యాప్తి తీవ్రతను గుర్తించేందుకు ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సీరో సర్వే నిర్వహించింది. తొలిదశలో అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో నిర్వహించగా... 15.7 శాతం మందికి వైరస్ సోకి, వెళ్లిపోయినట్లు తేలింది. ఇప్పుడు... రెండో దశలో మిగిలిన తొమ్మిది జిల్లాల్లోనూ సర్వే చేశారు. ఆ ఫలితాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ గురువారం మీడియాకు వెల్లడించారు.
దీని ప్రకారం... సీర్వో సర్వేలో భాగంగా ఒక్కొక్క జిల్లా నుంచి 5 వేల మంది చొప్పున మొత్తం 45వేల శాంపిల్స్ సేకరించారు. వారిలో 19.7 శాతం మందికి తెలియకుండానే వైరస్ సోకి.. దానంతట అదే తగ్గిపోయినట్టు తేలింది. వైరస్ సోకిన వారిలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. విజయనగరం జిల్లా లో అత్యధికంగా 30.6 శాతం మంది రక్త నమూనాల్లో కరోనా సంబంధిత యాంటీ బాడీ్సను గుర్తించారు. ఆ తర్వాత స్థానాల్లో కర్నూలు జిల్లా 28.1 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 21.5 శాతం ఉన్నాయి. ఇక... చిత్తూరు జిల్లాలో 20.8 శాతం, విశాఖపట్నంలో 20.7 శాతం, కడపలో 19.3 శాతం, గుంటూరు జిల్లాలో 18.2 శాతం, ప్రకాశం జిల్లాలో 17.6 శాతం మందిలో యాంటీబాడీస్ కనిపించాయి. 12.3 శాతంతో పశ్చిమ గోదావరి ఆఖరి స్థానంలో ఉంది.
వైరస్ సోకినట్లు తెలియకుండానే మహమ్మారిని జయించినవారిలో... పురుషులు 19.5 శాతం, మహిళలు 19.9 శాతం మంది ఉన్నారు.
ఇదీ అంచనా...
పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి ముందు ముందు ఇంకా విజృంభించే అవకాశం ఉంది. ప్రకాశం, కడప జిల్లాల్లోనూ వైరస్ ఉధృతి పెరగవచ్చు. విజయనగరం, కర్నూలు జిల్లాల్లో క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి.
భవిష్యత్ ప్రణాళిక కోసమే...
‘‘వైరస్ వ్యాప్తి ఏయే జిల్లాలో ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించాం. ఈ సర్వే ఫలితాలు వ్యాధి సంక్రమణ తీవ్రతను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్ కార్యాచరణకు సహాయ పడతాయి. అందుకనుగుణంగా ఆయా జిల్లాల్లో కొవిడ్ ఆసుపత్రుల ఏర్పాటు, వాటిలో మౌలిక సదుపాయాల కల్పన చేపట్టవచ్చు. తొలిసారి ఢిల్లీలో నిర్వహించిన సీరో సర్వేలో 29.8 శాతం రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పట్టింది. మన రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన తొలిదశ సీరో సర్వేలో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 21.7 శాతం మంది రక్త నమూనాల్లో కరోనా సంబంధిత యాంటీబాడీలు కనిపించాయి. ఆ తర్వాత నుంచి ఈ జిల్లాలో కూడా కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది!
కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్