యమపురికి దారులు.. కల్తీ శానిటైజర్లు!
ABN , First Publish Date - 2020-08-04T08:38:33+05:30 IST
యమపురికి దారులు.. కల్తీ శానిటైజర్లు!
కరోనా నేపథ్యంలో పెరిగిన వినియోగం
మార్కెట్లను ముంచెత్తుతున్న కల్తీలు
మిథనాల్ను వినియోగిస్తున్న గ్యాంగులు
చీప్గా వస్తున్నాయని కొంటే.. ప్రాణాలకే ముప్పు
హైదరాబాద్ సిటీ/బాలానగర్, ఆగస్టు 3(ఆంధ్రజ్యో తి): రాష్ట్రంలో కల్తీ శానిటైజర్ల ముఠాలు కుప్పలుతెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. కరోనా విజృంభన నేపథ్యంలో శానిటైజర్లకు డిమాండ్ పెరగడంతో.. ఇప్పుడు ఈ ము ఠాల వ్యాపారం మూడుపువ్వులు.. ఆరు కాయలుగా సా గుతోంది. ప్రభుత్వ యంత్రాంగాలు దీనిపై దృష్టి సా రించకపోవడంతో.. కల్తీ శానిటైజర్ల తయారీ, పంపిణీ, అమ్మకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
ఇథనాల్తోనే తయారు చేయాలి
నిజానికి శానిటైజర్లలో ఇథనాల్ ఆల్కహాల్ను వినియోగించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కూడా ఇదే ప్రమాణాలను సూచిస్తోంది. దీంతోపాటు.. ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ లేదా ఎన్ప్రొఫైల్ ఆల్కహాల్ను వినియోగించవచ్చు. 60-90ు ఇథనాల్ను వినియోగించవచ్చు. ఇథనాల్ను నేరుగా తాగినా.. ప్రమాదకరమే మీ కాదు. అది స్వచ్ఛమైన సారా లాంటిది. ఇథనాల్తోపాటు.. గ్లిజరిన్, హైడ్రోజన్ ఫెరాక్సైడ్ను వాడుతారు. అలా 5లీటర్ల నాణ్యమైన శానిటైజర్ తయారీకి సుమా రు రూ.750 ఖర్చు అవుతుంది. ఇందులో ఇథనాల్ క్ర యవిక్రయాలకు అనుమతులు అవసరం. ఎక్సైజ్ శాఖ నిఘా కూడా ఉంటుంది. పైగా 18ు పన్ను చెల్లించాలి.
కల్తీలు ఇలా..
కల్తీ శానిటైజర్లో ఇథనాల్కు బదులుగా మిథనాల్ వాడుతున్నారు. దీని ధర లీటరుకు రూ. 10 - రూ. 15 మధ్యలో ఉంటుంది. దీంతో.. కల్తీ గ్యాంగులు మిథనాల్ తో శానిటైజర్లను తయారు చేస్తున్నాయి. ఈ పద్ధతిలో 5లీటర్ల శానిటైజర్ తయారీకి రూ.100లోపు ఖర్చు అవుతుంది. అలా ప్రమాదకరమైన మిథనాల్తో తయా రు చేసిన శానిటైజర్లను 100 మిల్లీలీటర్లను రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. ఇథనాల్తో చేసిన నాణ్యమైన శానిటైజర్ ధర 100 మిల్లీలీటర్ల బాటిల్కు రూ. 100 నుంచి రూ. 150 వరకు ఉంటోంది. దీంతో ప్రజలు త క్కువ ధరకు వచ్చే శానిటైజర్లనే కొనుగోలు చేస్తున్నారు. అది ప్రాణాంతకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రముఖ బ్రాండ్లకు నకిలీలు..
కల్తీ ముఠాలు కొన్ని బ్రాండ్లకు సంబంధించిన నకిలీ లేబుళ్లతో మిథనాల్తో తయారు చేసిన శానిటైజర్లను మార్కెట్లలోకి విడుదల చేస్తున్నాయి. కొన్ని ముఠాలు తప్పుడు చిరునామాతో ఇతర రాష్ట్రాల బ్రాండ్లతో శానిటైజర్లను తయారు చేస్తున్నాయి. బాలానగర్ చిరునామాతో వందన ఫార్మా తయారు చేసినట్లుగా లేబుళ్లు ఉన్న శానిటైజర్లను సేవించి ఇటీవల ఏపీలో పలువురు మృతి చెందారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. బాలానగర్ పారిశ్రామిక వాడ మొత్తంలో వందన అనే ఫార్మాకంపెనీ లేదని తేలింది. పైగా అతిగా శానిటైజర్లను వాడినా నష్టం తప్పదంంటున్నారు వైద్యులు. స్వచ్ఛమైన ఆల్కహాల్తో తయారైనా.. రోజూ వాడుతుంటే చేతులు పొడిబారి, పగుళ్లు, దురద, మంట బొబ్బలు రావడం వంటి పరిణామాలు ఎదురవుతాయని చెబుతున్నార’ు. శానిటైజర్లను తరచూ వినియోగించేవారిపై యాంటీ బయోటిక్స్ ప్రభావం తక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.
మిథనాల్.. యమా డేంజర్
మిథనాల్ చాలా ప్రమాదకరం. శానిటైజర్లో మిథనాల్ ఉంటే.. అది శ్వేదరంధ్రాల ద్వారా శరీరంలోకి వెళ్లే ప్రమాదముంది. 10 మిల్లీలీటర్ల శానిటైజర్ శరీరంలోకి వెళ్తే.. ఆ వ్యక్తి చావుకు దగ్గరైనట్లే. దీని ప్రభావం తొలుత కంటిచూపుపై పడుతుంది. అలర్జీ వస్తుంది. శరీరంలోకి వెళ్లిన మిథనాల్ ఫార్మల్డీహైడ్గా మారిపోతుంది. మెటబాలీ డిస్టర్బెన్స్కు దారి తీస్తుంది. ఫలితంగా మరణం సంభవిస్తుంది. తక్కువ ధరలో వస్తుంది కదా? అని కల్తీ శానిటైజర్లు కొనొద్దు. బ్రాండెడ్ శానిటైజర్ల వినియోగమే శ్రేయస్కరం. లేకుంటే.. చేతులను శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లను వదిలేసి సబ్బు నీళ్లను వాడటం మంచిది.
- డాక్టర్ అనగాని మంజుల, పద్మశ్రీ అవార్డు గ్రహీత (మెడీకవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్)