బీసీజీ వాక్సిన్తో కరోనా నెమ్మదిస్తోంది..వెల్లడించిన అమెరికా పరిశోధకులు!
ABN , First Publish Date - 2020-08-03T14:24:20+05:30 IST
క్షయ వ్యాధి నివారణకై వినియోగించే బీసీజీ వాక్సిన్ కరోనా వైర్సను నెమ్మదించేలా చేస్తుందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు. అమెరికన్ అసోసియే
- అమెరికా పరిశోధకుల వెల్లడి
ముంబై, ఆగస్టు 2: క్షయ వ్యాధి నివారణకై వినియోగించే బీసీజీ వాక్సిన్ కరోనా వైర్సను నెమ్మదించేలా చేస్తుందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు. అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్కు చెందిన సైన్స్ అడ్వాన్సెస్ అనే జర్నల్లో ఈ విషయాన్ని ప్రచురించారు. ఈ పరిశోధన కోసం.. కరోనా ప్రవేశించిన తొలి నెలరోజులకు 135 దేశాల్లో పాజిటివ్ కేసుల్ని, 134 దేశాల్లో మరణాల శాతాన్ని పరిశీలించినట్లు తెలిపారు. పుట్టిన 15రోజుల లోపు శిశువులకు ఇచ్చే బాసిలస్ కాల్మెటీ-గుయెరిన్(బీసీజీ) వాక్సిన్ క్షయ నివారణతో పాటు వారిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ వాక్సిన్ తప్పనిసరిగా వాడుతున్న దేశాల్లో కరోనా ప్రవేశించిన తొలి 30రోజుల్లో నెమ్మదిగా వ్యాప్తి చెందడమే కాక, మరణాల శాతం కూడా తక్కువగా ఉంటోందని పరిశోధకులు పేర్కొన్నారు. అందుకు భారత్, చైనాలను వారు ఉదహరించారు. దశాబ్దాల క్రితమే బీసీజీని అమెరికా తప్పనిసరి చేసి ఉంటే.. ఆ దేశంలో కరోనాతో మార్చి 29కల్లా 2457మందికి బదులు కేవలం 468మంది మాత్రమే కన్నుమూసి ఉండేవారని అంచనా వేశారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ఉన్న అన్ని దారులను ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీజీపై కూడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. కరోనాకు బీసీజీ పరిష్కారమా అన్న ప్రశ్నకు మరో రెండు లేదా మూడు నెలల్లో సమాధానం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..