పట్టణాల్లోనే పాజిటివ్‌ కేసులు ఎక్కువ

ABN , First Publish Date - 2020-03-29T09:36:44+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లోనే కరోనా ఎక్కువగా విస్తరిస్తోందని మంత్రి ఆళ్ల నాని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 13 పాజిటివ్‌ కేసుల్లో...

పట్టణాల్లోనే పాజిటివ్‌ కేసులు ఎక్కువ

  • విదేశాల నుంచి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా : ఆళ్ల నాని

అమరావతి/విజయవాడ, మార్చి 28(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లోనే కరోనా ఎక్కువగా విస్తరిస్తోందని మంత్రి ఆళ్ల నాని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 13 పాజిటివ్‌ కేసుల్లో 12 అర్బన్‌  ప్రాంతాల్లో, ఒకటి గ్రామీణ ప్రాంతంలో నమోదయ్యాయన్నారు.  కరోనా వ్యాప్తి నియంత్రణపై సీఎం జగన్‌ సమీక్ష అనంతరం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని చెప్పారు. లాక్‌డౌన్‌ లో ఇచ్చిన మినహాయింపు సమయాన్ని తగ్గించే అంశంపై సీఎం వద్ద ప్రతిపాదించామని,  అయితే అమలులో సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని, దుకాణాల సంఖ్య పెంచి జనసమూహాన్ని తగ్గించాలని సీఎం సూచించారని చెప్పారు.  రాష్ట్రంలో 428 అనుమానిత కేసులు ఉండగా 378 నెగటివ్‌, 13 పాజిటివ్‌ వచ్చాయని, ఇంకా 37 కేసులకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. విదేశాల నుంచి ఎంతమంది వచ్చారో తెలుసుకునేందుకు మరోసారి పూర్తిస్థాయి సర్వే చేసేందుకు నిర్ణయించామన్నారు. అనుమానిత కేసులకు చికిత్స చేస్తున్నవారికీ ప్రత్యేక రక్షణ దుస్తులు ఇస్తామన్నారు.  


వ్యవసాయ యంత్రాల రవాణాపై ఆంక్షలు లేవు

రాష్ట్రంలో వరి పంట కోతకు వచ్చిందని, ఈ నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన యంత్ర పరికరాల రవాణాపై ఎటువంటి నిషేధం లేదని మంత్రులు స్పష్టం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని పేర్కొన్నారు. శనివారం ఉదయం విజయవాడలోని ఆర్‌అండ్‌బీ భవన ప్రాంగణలో కరోనా నివారణపై ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీలోని మంత్రుల బృందం ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించింది. 

Updated Date - 2020-03-29T09:36:44+05:30 IST