కష్టకాలం.. కలిసి ఎదుర్కొందాం: గవర్నర్
ABN , First Publish Date - 2020-03-31T09:23:01+05:30 IST
కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ప్రజలందరం ఉమ్మడిగా ఎదుర్కోవడమే దీనికి మార్గమని పిలుపునిచ్చారు. ఇంట్లోనే ఉండడం, తరచూ
అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ప్రజలందరం ఉమ్మడిగా ఎదుర్కోవడమే దీనికి మార్గమని పిలుపునిచ్చారు. ఇంట్లోనే ఉండడం, తరచూ చేతులు కడుక్కోవడం, భౌతికదూరం పాటించడమే కరోనా వైరస్ను ఎదుర్కొనే మార్గమని స్పష్టం చేశారు. ప్రపంచ పరిణామాలు చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతోందన్నారు. జాగ్రత్తలు పాటించాలని, కరోనాపై యుద్ధంలో భాగ స్వాములు కావాలని సోమవారం ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. పేదలు, అనాథలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంఘాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని సహాయనిధికి పారిశ్రామికవేత్తలు, సినీ పరిశ్రమ, వ్యాపారవర్గాలు విరివిగా విరాళాలు ఇస్తున్నాయని అభినందించారు. మరింతగా విరాళాలు ఇచ్చి సహకరించాలన్నారు. తనవంతుగా సీఎం సహాయనిధికి లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.